“ఓటింగ్ ముగిసింది… ఇప్పుడు ఎవరు గెలుస్తారు?” ఇది ప్రతి ఎన్నికల తర్వాత వినిపించే పెద్ద ప్రశ్న. ఓటింగ్ పూర్తయ్యే సరికి టీవీ స్క్రీన్లపై నంబర్లు మెరుస్తాయి… సీట్ల అంచనాలు వస్తాయి… స్టూడియోలలో చర్చలు వేడెక్కుతాయి. ఎవరు ముందున్నారు? ఎవరు వెనుకబడ్డారు?
కానీ ఒక్కసారి ఆలోచించండి.. ఇవన్నీ నిజమా? లేక… ఫలితాల ముందు కనిపించే ఒక పెద్ద నెంబర్ల గేమ్ మాత్రమేనా?
అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి?
ఎన్నికల రోజు ఓటర్లు తమ ఓటు వేసి బయటకు వచ్చిన వెంటనే, కొంతమంది సర్వే టీమ్స్ వాళ్లను మీరు ఎవరికి ఓటు వేశారు? అని అడుగుతాయి. ఆ సమాధానాలను సేకరించి, గణాంకాలుగా మార్చి, దేశం లేదా రాష్ట్రం మొత్తం ఎలా ఓటేసిందో అంచనా వేస్తారు. ఇదే ఎగ్జిట్ పోల్స్.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం.. ఇవి అధికారిక ఫలితాలు కాదు. కేవలం అంచనాలు మాత్రమే. ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఓటర్ల నిజాయితీ మీద ఆధారపడతాయి. ఒక ఓటరు నిజం చెబుతాడా? చాలామంది చెబుతారు. కానీ కొంతమంది “ఎవరికి ఓటు వేసానో చెప్పను” అంటారు. ఇంకొందరు కావాలనే తప్పుగా చెబుతారు. అక్కడే డేటా డిస్టర్బ్ అవుతుంది.ఇది చిన్న విషయం అనిపించినా, ఫైనల్ అంచనాలను పూర్తిగా మార్చేస్తుంది.
దేశంలో కోట్ల మంది ఓటర్లు ఉంటారు. కానీ ఎగ్జిట్ పోల్స్ కొన్ని వేల లేదా లక్షల మందినే అడుగుతాయి. అంటే మొత్తం జనాభాలో చిన్న భాగమే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. ఆ సాంపిల్ నిజంగా దేశాన్ని ప్రతిబింబిస్తుందా? గ్రామాలు, పట్టణాలు, మహిళలు, యువత, వేర్వేరు వర్గాలు అందరూ సమానంగా కవర్ అవుతున్నారా? ఒక ప్రాంతం ఎక్కువగా, ఇంకో ప్రాంతం తక్కువగా కవర్ అయితే… అంచనాలు తప్పిపోతాయి.
ఇక మీడియా హైప్ సమాచారం లేదా ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే… ఎగ్జిట్ పోల్స్ విడుదలైన వెంటనే ఛానెల్స్ మధ్య పోటీ మొదలవుతుంది. ఎవరి అంచనా కరెక్ట్ అవుతుందో అన్న రేస్.
గ్రాఫిక్స్, స్టూడియో డిబేట్స్, రాజకీయ నాయకుల కామెంట్స్.. మొత్తం వాతావరణం ఫుల్ హీట్ అవుతుంది.
ఇది ప్రజలకు సమాచారం ఇస్తుందా? అవును. కానీ అదే సమయంలో థ్రిల్, టెన్షన్, సెన్సేషన్ కూడా పెంచుతుంది. అందుకే వీక్షకుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి.. ఇది ఫైనల్ కాదు.
చరిత్ర చెప్పే నిజం ఏంటంటే.. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ కరెక్ట్గా ఉండవు. కొన్ని సార్లు దగ్గరగా ఉంటాయి. కానీ చాలా సందర్భాల్లో పూర్తిగా తప్పిపోయాయి కూడా. గతంలో కొన్ని ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఒక పార్టీ గెలుస్తుందని చెప్పగా… అసలు ఫలితాలు వేరేలా వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అనేవి గ్యారంటీ కాదు అని చెప్పటానికి ఇది ఒక క్లియర్ మెసేజ్.
ఇక మానసిక ప్రభావం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై నేరుగా ప్రభావం చూపకపోయినా… ప్రజల మనసులపై మాత్రం ప్రభావం చూపుతాయి. “ఈ పార్టీ గెలుస్తోంది” అనే ఫీలింగ్ వచ్చిన వెంటనే… అదే చర్చ మొదలవుతుంది. సోషల్ మీడియాలో అదే ట్రెండ్ అవుతుంది.
అంటే ఫలితాల కంటే ముందే ఒక నేరేటివ్ తయారవుతుంది.
ఇప్పుడు డేటా అనలిటిక్స్, కొత్త టెక్నాలజీలు కూడా ఎగ్జిట్ పోల్స్లో ఉపయోగిస్తున్నారు. కానీ బేస్ డేటా మాత్రం మనుషులే ఇస్తారు. అక్కడ తప్పు ఉంటే… టెక్నాలజీ కూడా దాన్ని సరిచేయలేదు.
అందుకే ఖచ్చితత్వం ఇంకా ఒక ప్రశ్నగానే ఉంది.
కాబట్టి మనం ఎగ్జిట్ పోల్స్ను ఫైనల్ ఫలితంగా తీసుకోవద్దు. వాటిని ఒక సూచనగా మాత్రమే చూడాలి. అసలు ఫలితాలు ఎన్నికల అధికారిక ప్రకటనలోనే ఉంటాయి. అదే నిజం. మరి ఎగ్జిట్ పోల్స్ అంటే ఎందుకు ఇంత క్రేజ్? ఎందుకంటే మనకు ముందే తెలుసుకోవాలనే ఆసక్తి. ఫలితాలు రాకముందే ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలనే కుతూహలం. అందుకే ఎగ్జిట్ పోల్స్కు ఇంత పాపులారిటీ.
మొత్తంగా చెప్పాలంటే.. ఎగ్జిట్ పోల్స్ అనేవి సినిమా ట్రైలర్లాంటివి… చూసినప్పుడు ఉత్సాహం పెరుగుతుంది… అంచనాలు పెరుగుతాయి…కానీ అసలు కథ, అసలు క్లైమాక్స్ మాత్రం రిజల్ట్ డే రోజే బయటపడుతుంది. కాబట్టి…నంబర్లను కాదు, నిజాన్ని నమ్మండి. ఎగ్జిట్ పోల్స్ను కాదు, ఫైనల్ ఫలితాలను వేచి చూడండి.
ALSO READ: యుద్ధభూములుగా మారిన నగరాలు.. మానవతా సంక్షోభానికి దారితీసిన సూడాన్ సివిల్ వార్!
