దేశ విభజన తర్వాత తెగిపడిన తలలెన్నో లెక్కేలేదు. బ్రిటిషర్లను తరిమికొట్టేంత వరకు ఏకతాటిపై నడిచిన యావత్ దేశం.. స్వాతంత్ర్యం తర్వాత రెండు వేరువేరు దారులు చూసుకున్నాయి. పాకిస్థాన్-ఇండియాగా విడిపోయి తన్నుకున్నాయి. రెండు దేశాల విభజన సమయంలో జరిగిన రక్తపాతానికి హద్దే లేదు. 1947 నుంచి 1950 వరకు ఈ హింస కొనసాగింది. అయితే ఆ తర్వాత ఎలా కంట్రోల్ అయ్యింది? ప్రస్తుత బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లకు నాటి హింసాత్మక ఘటనలకు ఏదైనా సారుప్యత ఉందా?
సైనిక చర్యకు డిమాండ్:
ఇలా రెండు దేశాల మధ్య మత ఘర్షణల కారణంగా అనేక మంది అమాయకులు ప్రాణాలు విడవాల్సి వచ్చింది. ఆ సమయంలో నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఆయన మంత్రివర్గం ఈ ఘర్షణలను ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మరోవైపు హిందూ సంఘాలు నెహ్రూ టార్గెట్గా తీవ్ర విమర్శలు గుప్పించాయి. పాకిస్థాన్పై సైనిక చర్యకు డిమాండ్ చేశాయి. అయితే సైనిక చర్య ద్వారా హింస పెరుగుతుందని భావించిన నెహ్రూ దౌత్యపరమైన పరిష్కారంవైపు మొగ్గుచూపారు. ముందుగా పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ను సంప్రదించారు. ఈ ఇద్దరూ కలిసి హింస ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. నెహ్రూ ప్రయత్నాలతో ఇటు ఇండియాలో ముస్లింల లక్ష్యంగా దాడులు చాలా వరకు కంట్రోల్లోకి వచ్చాయి. అయితే పాకిస్థాన్లో మాత్రం ఆ పరిస్థితి రాలేదు. దీంతో దౌత్య మార్గాన్ని వీడి సైనిక చర్యకు దిగాలని మరోసారి నెహ్రూపై ఒత్తిడి పెరిగింది.
లక్షల్లో వలస వచ్చిన శరణార్థులు:
అప్పటివరకు పాకిస్థాన్ పట్ల మెతక వైఖరి పాటించిన నెహ్రూ 1950 ఫిబ్రవరిలో దాయాది దేశానికి గట్టి హెచ్చరిక పంపారు. తూర్పు పాకిస్తాన్లో హింసాకాండపై భారత్ ఇకపై ఉదాసీనంగా ఉండదని కుండబద్దలు కొట్టారు. తూర్పు-పశ్చిమ పాకిస్తాన్తో సరిహద్దుల వెంబడి సాయుధ బలగాలను సమీకరించాలని నెహ్రూ ఇండియన్ ఆర్మీకి ఆదేశించారు. 1950 మార్చి ప్రారంభంలో పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దు వైపు భారత సాయుధ బలగాలు కదిలాయి. మరోవైపు నెహ్రూ తన దౌత్య ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో బ్రిటన్తో పాటు అమెరికా లాంటి ప్రపంచ శక్తులకు చేరువయ్యారు. అటు మార్చి 1950 నాటికి హిందూ శరణార్థుల సంఖ్య 2లక్షలకు పైగా పెరగడంతో పరిస్థితి మరింత దిగజారింది.
నాటి ఒప్పందంలో ఏం ఉంది?
ఓవైపు దౌత్య చర్చలను కొనసాగిస్తూనే నెహ్రూ ఆర్మీని యాక్టివ్ చేశారు. భారీ సైనిక సమీకరణకు పిలుపునిచ్చారు. అయితే భారత సైన్యం సమీకరణను పాక్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. వెంటనే పాక్ ప్రభుత్వానికి ఈ విషయాన్ని చేరవేసింది. దీంతో పాక్ దెబ్బకు దిగొచ్చింది. ఇండియాతో దౌత్యానికి నాటి పాక్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ అంగీకరించారు. 1950 ఏప్రిల్ 2న ఢిల్లీ వేదికగా నెహ్రూ-లియాఖత్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం భారత్-పాకిస్తాన్ రెండూ తమ తమ దేశాల్లోని మైనారిటీ వర్గాల హక్కులను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నాయి. శరణార్థులకు సహాయం చేయడం, హింసకు కారణమైన వారిని శిక్షించడం లాంటి అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి.
Also Read: చెవిటిదైన ప్రపంచంలో పసిజీవుల ఆర్తనాదాలు..! నెత్తుటి సముద్రం కళ్ళ చూస్తున్న రణం