Menu

స్మశానంలో మొదలై, చరిత్రగా మారిన ఒక అమ్మ జీవితం.. సింధుతాయ్ సప్కల్ జీవన ప్రయాణం!

Lakshmi Aruna 2 weeks ago
who is Sindhutai Sapkal

ఇది సినిమా కథ కాదు. ఇది ఒక మహిళ జీవితం. ఊహకందని కష్టాలు, తట్టుకోలేని అవమానాలు, అయినా వాటన్నింటినీ మించి నిలిచిన ఒక గుండె కథ. ఈ కథలో హీరోయిజం లేదు, డైలాగులు లేవు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేదు. అయినా ప్రతి వాక్యం మన గుండెను గట్టిగా పట్టుకుని ఊపేస్తుంది.

మహారాష్ట్రలోని వర్ధా జిల్లాకు చెందిన ఒక చిన్న గ్రామంలో ఆమె జీవితం మొదలైంది. చిన్న వయసులోనే పెళ్లి, చదువు లేకుండా జీవితం భారంగా మారింది. గర్భంతో ఉన్న సమయంలోనే ఆమెపై అనుమానాల ముద్ర వేసారు. నిజం ఏమిటో తెలుసుకోవాలని కూడా ప్రయత్నించకుండా, భర్త చేతులారా కొట్టబడి, ఇంటి నుంచి తరిమివేయబడింది. అది అమావాస్య రాత్రి. వర్షం కురుస్తోంది. ఆశ్రయమంటూ ఏమీ లేదు.
ఊరి చివర ఉన్న ఒక పాడుబడ్డ గొడ్డు చావిడిలో, జంతువుల మధ్య ఆమెకు ప్రసవ నొప్పులు వచ్చాయి. సహాయం చేసే మనిషి లేడు. వెలుగు లేదు. చేతిలో సాధనం లేదు. ఆ క్షణంలో ఆమె ఒంటరితనం ఎంత భయంకరమో చెప్పలేం. అయినా ఆ రాత్రే ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బతకడానికి, బిడ్డను బతికించడానికి ఆమె చేసిన ప్రయత్నం మనిషి ధైర్యానికి పరాకాష్ట.

రక్తం కారుతున్న శరీరంతో, బిడ్డను గుండెలకు హత్తుకుని, ఆమె పుట్టింటి వైపు నడిచింది. కనీసం అమ్మ అయినా అంగీకరిస్తుందన్న ఆశ. కానీ అక్కడ కూడా నిరాకరణే ఎదురైంది. సమాజం ఆమెను అంగీకరించలేదు. ఇంటి, ఊరి, బంధాలన్నీ మూసుకుపోయాయి. అక్కడ నుంచే ఆమె జీవితం మరో మలుపు తిరిగింది. రైల్వే స్టేషన్లు ఆమె ఇల్లు అయ్యాయి. భిక్షాటనే జీవనం అయ్యింది. రాత్రివేళ స్మశానాల్లో నిద్రించింది. భయం మనుషులంటే తప్ప, చీకటి అంటే కాదు. ఆకలి వస్తే దొరికినదే తిన్నది. చేతిలో ఉన్న పసిబిడ్డ ఏడుపు ఆమె గుండెను చీల్చేది.

ఒక దశలో జీవితం మీద ఆశ పూర్తిగా కోల్పోయింది. కానీ అదే సమయంలో ఆమె కళ్ల ముందు ఒక దృశ్యం మార్పు తెచ్చింది. ఆకలితో క్షీణిస్తున్న ఒక వృద్ధుడు. ఆమె దగ్గర ఉన్న చిన్న ఆహార ముక్కను అతనికి ఇచ్చింది. ఆ క్షణంలో ఆమెకు ఒక విషయం అర్థమైంది. తన బాధ ఒక్కదానిదే కాదు. ఈ ప్రపంచంలో అమ్మ లేని పిల్లలు, దిక్కులేని మనుషులు ఎంతోమంది ఉన్నారు. అక్కడే ఆమె నిర్ణయం తీసుకుంది. బతకాలి. తన కోసం కాదు, ఇతరుల కోసం. అలా ఒక అబల మహిళ, వేల మంది అనాథలకు తల్లిగా మారింది. రోడ్ల మీద దొరికిన పిల్లలను చేరదీసింది. “నా పిల్లలకు ఆకలిగా ఉంది” అంటూ భిక్ష అడిగింది. ఆమె ఆవేదనకు మనుషుల గుండెలు కరిగాయి. సహాయం అందింది. ఒక్కొక్కరిగా పిల్లల సంఖ్య పెరిగింది.

కాలక్రమంలో ఆమె ఆశ్రమాలు నిర్మించింది. చదువు ఇచ్చింది. జీవితం నేర్పింది. ఆ పిల్లల్లో చాలామంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, బాధ్యతగల పౌరులయ్యారు. ఒకప్పుడు ఆమె నిద్రపోయిన స్మశానాల స్థానంలో, ఇప్పుడు ఆశతో నిండిన ఆశ్రమాలు నిలిచాయి. ప్రపంచం ఆమెను గుర్తించింది. వందలాది అవార్డులు వచ్చాయి. భారత ప్రభుత్వం ఆమె సేవలను గౌరవించింది. కానీ ఆమె గొప్పతనం అక్కడితో ఆగలేదు.
చాలా ఏళ్ల తర్వాత, వృద్ధాప్యంలోకి వచ్చాక, ఒక ముసలివాడు ఆమె ఆశ్రమానికి వచ్చాడు. అతడు ఎవరో కాదు .. ఒకప్పుడు ఆమెను తన్ని తరిమేసిన భర్త. కాళ్లపై పడి క్షమించమన్నాడు. ఆశ్రయం అడిగాడు. ఆ క్షణంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెను మానవత్వానికి మించిన స్థాయిలో నిలబెట్టింది. ఆమె ప్రతీకారం కోరలేదు. కసితో మాట్లాడలేదు. “ఇప్పటికే నేను వేల మందికి తల్లిని. ఒక తల్లి తన బిడ్డను ఎలా కాదంటుంది?” అని చెప్పింది. భర్తగా కాదు, బిడ్డగా అతనికి చోటిచ్చింది. క్షమించడమే నిజమైన శక్తి అని ప్రపంచానికి చూపించింది.

ఆమె పేరు సింధుతాయ్ సప్కల్. ఆమె జీవితం ఒక బోధ. కష్టం ఎంత లోతుగా నెట్టినా, మనసు అంత ఎత్తుకు ఎదగగలదని చెప్పే సాక్ష్యం. డబ్బు లేకపోయినా, చదువు లేకపోయినా, ఒక్క గుండె ధైర్యంతో చరిత్ర సృష్టించవచ్చని నిరూపించిన జీవితం.

ఆమె 1948 నవంబర్ 14న మహారాష్ట్రలోని వర్ధా జిల్లాలో జన్మించింది. ఒక చిన్న గ్రామం నుంచి పుట్టిన ఒక బాలిక వేల మంది పిల్లలకు తల్లిగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. ఆమె 1400 మందికిపైగా అనాథ పిల్లల జీవితాలను మార్చింది. 100 అనాథల తల్లి అనే పేరుతో ప్రపంచం ఆమెను గుర్తించింది. 282 అల్లుళ్లు, 48 కోడళ్లు, 300 మందికిపైగా మనవళ్లు మనవరాళ్లు ఉన్న ఒక జీవంత కుటుంబంగా ఆమె జీవితం మారింది. దేవాలయాల ముందు భిక్ష అడిగిన చేతులే దేశాధ్యక్షుడి చేతుల ద్వారా గౌరవం పొందాయి. భారత ప్రభుత్వం ఆమె సేవలకు అత్యున్నత మహిళా పౌర పురస్కారం అందించింది. మహారాష్ట్ర ప్రభుత్వం సహా అనేక సంస్థలు వందలాది అవార్డులతో ఆమెను సత్కరించాయి. 17 దేశాలు తిరిగి తన జీవితం గురించి మాట్లాడిన ఒక తల్లి కథగా ఆమె ప్రపంచానికి నిలిచింది. 2022 జనవరి 4న పుణెలో ఆమె శరీరం మాత్రమే విశ్రాంతి తీసుకుంది కానీ, ఆమె ప్రేమ ఆమె త్యాగం ఆమె కరుణ ఆమె మానవత్వం ఈ దేశంలో ఇంకా శ్వాస తీసుకుంటూనే ఉంది. అనాథ పిల్లల కళ్లలో ఆశగా జీవిస్తోంది. సింధుతాయ్ సప్కల్ అనే పేరు ఇప్పుడు ఒక వ్యక్తి కాదు.. ఒక తల్లి భావన.. ఒక జీవన సందేశం.. ఒక యుగసాక్ష్యం.. ఒక శాశ్వత వెలుగు!

ఈ కథ చదివాక, మన కష్టాలు చిన్నవిగా అనిపిస్తాయి. జీవితం నేలకేసి కొట్టినప్పుడే మనం ఆకాశం వైపు ఎగరగలం. కన్నీళ్లు తుడుచుకుని ముందుకు నడవగలం. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఒక యోధుడు ఉన్నాడు.

ALSO READ: రక్త సంబంధం గొప్పదా? లేదా అవసరానికి అండగా ఉండే స్నేహం గొప్పదా? ఆమె జీవితం చెప్పిన సమాధానం


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *