‘మీకు చీము, నెత్తురు ఉంటే ఎమ్మెల్యేలగా రాజీనామా చేయండి… మీకు చెప్పుల దండ వేయిస్తా..’
‘పార్టీ ఫిరాయింపుల్లో మోదీకి కేసీఆరే ఆదర్శం..’
ఇది అధికారంలోకి రాకముందు రేవంత్రెడ్డి చెప్పిన మాటలు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119లో కేవలం 19 స్థానాలే గెలిచింది కాంగ్రెస్. అందులో 12మందిని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫిరాయించుకుంది. ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్కు దక్కకుండా చేసింది. ఏకంగా 2/3rd ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగేసుకుంది. ఇలా గంపగుత్తిగా మూడలో రెండో వంతు ఎమ్మెల్యేలు పార్టీ మారితే అది విలీనం కిందకే వస్తుంది. అంటే ఆ టైమ్లో కాంగ్రెస్కు లెజిస్లేచర్ స్టేటసే లేదన్నమాట! ఇది తన రాజకీయ జీవితంలో కేసీఆర్ చేసిన అతి పెద్ద ఘోరం. ఫిరాయింపులకు మించిన దారుణం రాజకీయాల్లో మరొకటి ఉండదు. 2014లోనూ కేసీఆర్ పార్టీ ఇలానే చేసింది. ఇదే విషయాలను ప్రస్థావిస్తూ నాడు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ కేసీఆర్ను టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేశారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్(బీఆర్ఎస్)లోకి వెళ్లిన 12మంది ఎమ్మెల్యేలపై 2023 జనవరి 7న కాంగ్రెస్ పార్టీ మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. ఏ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఎలా ఎర వేసిందో చెబుతూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.
ఈ మాత్రం దానికి రాజ్యాంగం పట్టుకోవడం దేనికి:
సీన్ కట్ చేస్తే.. 2024 జులై.. ఇప్పటికే 10మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అప్పటి నుంచి ఇప్పటివరకు పాలన కంటే ఫిరాయింపులపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. సీఎం స్థానంలో ఉన్న రేవంత్ బీఆర్ఎస్ ఎమ్మేల్యేల ఇళ్లకు తిరుగుతూ హస్తం కండువా కప్పుతుండడం ఘోరం. ఓవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకోని పార్లమెంట్లో తిరుగుతుండడం.. ఇటు రేవంత్ రెడ్డి రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ ఫిరాయింపులను దగ్గరుండి డైరెక్ట్ చేస్తుండడం విడ్డూరం.
కక్షసాధింపులకు వేదిక:
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు బీఆర్ఎస్ 39 చోట్ల గెలిచింది. అయితే సికింద్రబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత 2024 ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ సెగ్మెంట్కు జరిగిన బై పోల్లో కాంగ్రెస్ గెలిచింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38కి పడిపోయింది. ఈ 38 ఎమ్మెల్యేల్లో 26మందిని కాంగ్రెస్ తన వైపునకు తిప్పుకోవాలని చూస్తోంది. ఎందుకంటే ఇది మూడింట రెండో వంతు నంబర్. నాడు కేసీఆర్ ఎలాగైతే కాంగ్రెస్కు దెబ్బకొట్టారో ఇప్పుడు రేవంత్ కూడా బీఆర్ఎస్కు అదే దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే 38మందిలో 10మంది కాంగ్రెస్ గూటికి చేరారు. అంటే అనాఫియల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య జూలై 16 వరకు 28 అన్నమాట. ఇంకో 16మందిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లాక్కోగలిగితే రేవంత్ మిషన్ సక్సెస్ అయినట్టు లెక్క కావొచ్చు. ఇక ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేసేందుకు జులై 16న కేసీఆర్ తన ఎమ్మెల్యేలంతా రావాలని చెప్పారు. అయితే ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా కేవలం 14మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వచ్చారు. మిగిలిన 14 మంది డుమ్మా కొట్టారు. అంటే ఈ 14మంది కూడా కాంగ్రెస్తో టచ్లో ఉన్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇలా రాష్ట్రంలో ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా వాళ్ళ సొంత కక్షసాధింపు తెలంగాణ రాజకీయాలకు వేదికైంది.
Also Read: ఎమెర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్ చేసింది ఇదే.. మరి ఉన్నట్టుండి రాజ్యాంగంపై ఆ కపట ప్రేమేందుకు?