Ugadi 2024: ఈ క్షణం ఉన్నట్టు తర్వాతి క్షణం ఉండకపోవచ్చు.. జీవితంలో ఏం జరగబోతుందో ఊహించడం కష్టం. అనుభవాల రిత్యా అంచనా వేసినా అనుకున్నదే జరుగుతుందని గ్యారెంటీ ఇవ్వలేం. నీ జీవితంలో జరగబోయేది ఇదేనని ఎవరైనా చెబితే నీకు ఎలా తెలుసు అని అడుగుతాం.. అదే ఓ పండితుడో, గుళ్లో పంతుళ్లో చెబితే ఆహా, ఓహో అంటాం. ఉగాది వచ్చిందంటే పచ్చడితో పాటు పంచాంగమూ వస్తుంది. రాబోయే ఏడాది ఏం జరగబోతుందో అందులో ఉంటుందట.
అప్పుడేం చెప్పలేదేం?
కరోనా వస్తుందని 2019 పంచాంగంలో ఎక్కడా లేదు. ఇక 2021 పంచాంగంలో ఆ ఏడాది కరోనా పీడ విరగడైందని రాసుకొచ్చారు. తీరా మే లో ఇండియా వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కమ్మేసింది. వేలాది మంది మరణించారు. అయినా పంచాంగమంటే ప్రజలకు ఆ మోజు ఎందుకో..! ప్రకృతి విపత్తులను, ప్రళయాలను పంచాంగాలు ముందుగానే చెప్పిన దాఖలాలు లేవు. అయినా ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకోవాలన్న ఆత్రుత ఈ జనాలుకు ఎందుకో!
ఈ రాశులేంటో.. ఆ రాతలేంటో:
ఇక ప్రతీరాజకీయ పార్టీకి పంచాంగం వేరువేరుగా ఉంటుంది. ఎవరి పంచాంగాల్లో వాళ్లే హీరోలు. అశాస్త్రియమైన ఈ పంచాంగాలను ప్రభుత్వాలే స్పాన్సర్ చేస్తాయి. ఇవి కూడా శాస్త్రాలేనని కొంతమంది బలగుద్ది, అవసరమైతే ముఖంపై గుద్ది కూడా చెబుతారు. అవును.. జ్యోతిష్యం ఒక శాస్త్రమట. ఉదయం రాశిఫలాలు చూడకుండా మంచినీరు కూడా తాగని జనాలు కోకొల్లలు. 800 కోట్ల జనాభాకు 12రాశులట. రోజూ అందులో రాసే నాలుగు ముక్కలనే.. అటు తిప్పి ఇటు తిప్పి ప్రతిరోజూ వాటిని తిప్పి తిప్పి అరగదీసి, ప్రజలు వెర్రొళ్లను చేయడం కూడా ఓ శాస్త్రమే కావొచ్చు. ఎందుకంటే వందల కోట్లమందిని నమ్మించడమంటే అది చిన్న విషయం కాదు కదా.. అందుకే ఉగాది పంచాంగానికి, రాశిఫలాలకు డిమాండ్ ఎక్కువ. అందులోనూ ఎలక్షన్ ఇయర్ కావడంతో ఏ రాజకీయనాయుకుడి రాశిఫలం ఎలా ఉంటుందోనన్న ఆత్రుత కనిపిస్తోంది. అనవరసరమైన విషయాల్లో ప్రజలకు ఆత్రుత ఉండడం సాధారణ విషయమే!
Also Read: మనసావాచా కాక్షించిన తమిళ బ్రాహ్మణ విద్వాంసుడు.. దళితులతో కలిసి కచేరీ చేయడమే తప్పైందా?