ఓ పసిపాప అదే పనిగా ఏడుస్తోంది.. తాను ఎప్పుడు చూడని ఓ నలుగురు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చారు.. అందులో ఓ మత పెద్ద కూడా ఉన్నాడు. అందులో ఒక అతను బ్లేడ్ తీశాడు. అందరూ కలిసి ఆమె చేతులు, కాళ్లు కదలకుండా పట్టుకున్నారు. ఆ ప్రాంతమంతా చిన్నారి ఏడుపుతో హృదయవిదారకంగా మారింది. ఇంతలోనే ఆమె శరీరంలోని జననేంద్రియం భాగాన్ని మతపెద్ద సమక్షంలో కోసేశారు. ఇదేదో నేరానికి సంబంధించిన క్రైమ్ సీన్ కాదు. ఇదో ఆచారం.. అవును ఇదో దురాచారం.. దుర్మార్గమైన ఆచారం.. చాలా ముస్లిం దేశాల్లో చిన్నారులపై జరిగే దారుణం ఇది. దీన్నే జననేంద్రియ మ్యుటిలేషన్ (Female Genital Mutilation) అంటారు. శాస్త్రసాంకేతిక రంగల్లో ప్రపంచం పరుగులు పెడుతుందని గొప్పలు చెప్పుకోవాలో… ఇంకా పాచిపాట్టిన, తుప్పుపట్టిన మతాచారాలను కొనసాగిస్తున్న వారిని చూసి జాలి పడాలో అర్థంకాని దుస్థితి. ఇలాంటి దురాచారాలు, మూఢనమ్మకాలపై అవగాహన కల్గించేందుకు ప్రతీ ఏడాది భారత్లో ఆగస్టు 20న నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డే గా జరుపుకుంటారు. 2013లో హత్యకు గురైన హేతువాది, డాక్టర్ నరేంద్ర దభోల్కర్ గౌరవార్థంగా ఈ రోజును గుర్తు చేసుకుంటారు.
దళిత వర్గాల కోసం అలుపెరగని పోరాటం:
మూఢనమ్మకాలకు ఎక్కువగా బలయ్యేది పేద, అణగారిన వర్గాల ప్రజలేనంటారు దభోల్కర్. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం దభోల్కర్ ఎన్నో పోరాటాలు చేశారు. బాబాలు, మాంత్రికులు చేసే దారుణాలను ఎండగట్టిన దభోల్కర్ సామాజీక కార్యకర్తగా ఎనలేని సేవలు చేశారు. మహారాష్ట్రలో మూఢనమ్మకాల వ్యతిరేక బిల్లు తయారీకి దభోల్కరే ప్రధాన కారణం. అయితే ఆ బిల్లును నాడు శివసేన, బీజేపీ తీవ్రంగా వ్యతీరేకించాయి. నిజానికి ప్రతీ మతంలోని మూఢనమ్మకాలను ఎదిరించిన దభోల్కర్కు యాంటీ-హిందూ ముద్ర వేశాయి కాషాయ పార్టీలు. ఎన్నోసార్లు ఆయనపై హత్యాయత్నాలు జరిగాయి. చివరకు 2013 ఆగస్టు 20న మార్నింగ్ వాక్కు వెళ్లిన దభోల్కర్ను హిందూ మతవాద ‘సనాతన్ సంస్థ’ సభ్యులు కాల్చి చంపారు.
నమ్మకాలు కావు అవి.. మూఢనమ్మకాలే:
శాస్త్రియ దృక్పథం(Scientific Temper) ప్రతీ ఒక్కరిలోనూ ఉండాలని ఆశించారు దభోల్కర్. అయితే దేశం ఆ వైపు కదులుతున్నట్టుగా ఏ మాత్రం అనిపించడంలేదు. నమ్మకం పేరుతో చేతికి కట్టుకునే తాయిత్తు దగ్గర నుంచి నరబలుల వరకు ప్రతీది సమాజానికి చెడు చేసేదే! మా నమ్మకం మా ఇష్టం.. మా తాయిత్తు మా ఇష్టం అని చెప్పుకునే వారు ఎక్కువయ్యారు. ఎవరి నమ్మకం వారి ఇష్టమనే వాదన ఏ మాత్రం సమర్థనీయం కానిది. ఎందుకంటే చాలా హత్యలు, దారుణాలు ఇలాంటి నమ్మకాల మాటునే జరుగుతున్నాయి. 2021 జనవరిలో జరిగిన మదనపల్లే జంట హత్యల కేసు చూస్తే ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తన సొంత కూతుర్లనే ఆ తల్లి చంపడానికి కారణం గుడ్డి నమ్మకమే..! అదే విధంగా తాయిత్తులతో రోగాలు నయమవుతాయని డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా ఉండేవారు కూడా మనకు కనిపిస్తారు. అటు క్రైస్తవం లోనూ ప్రార్థణలతో, ప్రార్థించిన నూనెతో జబ్బు నయం అవుతుందని భావించేవారు ఎక్కువగా కనిపిస్తారు. ఇటు ఇస్లాంలోనూ ఇదే తరహా ధోరణి కనిపిస్తుంది. ఇదంతా వారి నమ్మకమే కదా.. మరి ఇందులో హేతుకత ఏదైనా ఉందని మీకు అనిపిస్తుందా?
వితండవాదపు మూర్ఖులు :
ఈ మూఢ నమ్మకాలు ప్రాణాంతకంగానే కాదు, ఆర్థికంగా సామాజికంగా కూడా తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి. సౌర మండలంలో నక్షత్రమైన సూర్యుడు దాని చుట్టూ భూమి దాని చుట్టూ చంద్రుడు ఇతర ఏడు గ్రహాలు, ఇది మనం ప్రాథమిక విద్యలో నేర్చుకున్న సైన్స్. దీనికి సంబంధించి సాటిలైట్, టెలిస్కోప్ సాయంతో తీసిన ఎన్నో వేల ఫోటోలు వీడియోలు రోజు చూస్తూనే ఉన్నాం కానీ అశాస్త్రీయమైన విషయాలను చేర్చుతూ తప్పుదారి పట్టిస్తున్నారు. భూమి గుండ్రంగా కాదు బల్లపరుపుగా ఉందని వాదించడం, వాస్తు శాస్త్రం పేరుతో కొన్ని వేలకోట్ల రూపాయల దందా ప్రతి ఏడు భారతదేశంలో చేస్తున్నారు. నాకు దిక్కులకు వాటి దిక్పాలకులు ఉంటారు అని, ఈ వాస్తు శాస్త్రం తగ్గట్టు కట్టడాలు నిర్మించకపోతే అనేక సమస్యలు వస్తాయని, పైగా పూజలు చేస్తే ఇవి పోతాయని.. నమ్మబలుకుతారు. బాధాకరమైన విషయం ఏంటి అంటే చదువుకున్న వారు కూడా ఈమధ్య వీటిని ఎక్కువగా పాటిస్తున్నారు.
జ్యోతిష్యం మరొక అతిపెద్ద వ్యాపారం. అసలు మన జీవితం మీద మన స్థితిగతుల మీద కానీ ఎటువంటి ప్రభావం చూపించని గ్రహాలు పైపెచ్చు ఆ గ్రహాలకు కులాలు, మనకు కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రాలను ఆధారంగా చేసుకుని జ్యోతిష్య వ్యాపారాన్ని దానికి అనుబంధంగా ఉంగరాలు తాయత్తులు శాంతిహోమాలు అంటూ ఎంతో పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మార్చేశారు.
దిష్టి.. అతి పెద్ద ముష్టి:
ఇక సైన్స్ ఎన్నో ఆధారాలతో జీవపరిణామ(Evolution) క్రమాన్ని నిరూపించినా, ఆధారాలు లేకుండా ప్రతిదీ సృష్టి అని అసలు పరిణామక్రమానికి ఆధారాలు లేవని తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి పరిణామక్రమాలను దాటుకుని వచ్చినవే. మనుషులు కేవలం ఇద్దరి(ఆడమ్ – ఈవ్) నుంచి వచ్చారు అని అశాస్త్రీయమైన సిద్ధాంతాన్ని మోస్తున్నారు. అదే నిజమై ఉంటే మనిషి జాతే ఈపాటికి అంతరించిపోయి ఉండేది అనే చిన్న విషయాన్ని విస్మరిస్తారు. వీటితోపాటు ఫలానా రోజు ఆ పని చేయొద్దు, ఉపవాస దీక్షలు, దిష్టిబొమ్మలు పెట్టటం-దిష్టి తీయటాలు, ఒక జీవి మూత్రం తాగితే రోగాలు పోతాయి అనటం.. లాంటి ఎన్నో నమ్మకాలు వాస్తవానికి మూఢత్వమే. వీటికి ఎలాంటి హేతుబద్ధమైన శాస్త్రీయమైన ఆధారాలు లేవు.
సమాజం చేయాల్సింది ఏంటి?
మహిళలకు భావప్రాప్తి కలగకూడదని మొదలైన స్త్రీ జననేంద్రియ వికృతీకరణ(FGM) నుంచి జ్యోతిష్యం వరకు ప్రతీది అహేతుకమే! మనుషుల్లో శాస్త్రియ దృక్పథం పెంచడానికి ప్రభుత్వాలు, మీడియా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కానీ ఆ పని జరగడం లేదు. మతాల గురించి సమతుల్యంగా రిపోర్టింగ్ చేయాల్సిన మీడియా అది చేయకపోగా సూర్య, చంద్ర గ్రహణాల గురించి అశాస్త్రియమైన విషయాలను ప్రజలకు దగ్గర చేస్తోంది. వీటికి సినిమా వంటి మాధ్యమాల ప్రభావం ఓ వైపు. ఇటు విద్యాసంస్థల్లోని పాఠ్యపుస్తకాలు శాస్త్రియతకు చాలా దూరంలో ఉంటున్నాయి. క్రిటికల్ థింకింగ్ అన్నది అసలు పిల్లల్లో కనిపించడంలేదు. అటు తల్లిదండ్రులు సైతం చిన్నతనం నుంచే అశాస్త్రియమైన విషయాలను పిల్లలకు నూరిపోస్తున్నారు. పైగా వాటిని గొప్ప విషయాలుగా చెబుతున్నారు. ఇవ్వన్నీ మారాలంటే ముందు విద్యవ్యవస్థ, దానిలో శాస్త్రీయత హేతుబద్ధత అనే ఆలోచనను తీసుకురావాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 A[h] నిర్దేశించిన శాస్త్ర దృక్పథానికి అందరూ తోడ్పడాలి అప్పుడే విజ్ఞానం పరిరవెల్లుతుంది ..!
Also Read: చెవిటిదైన ప్రపంచంలో పసిజీవుల ఆర్తనాదాలు..! నెత్తుటి సముద్రం కళ్ళ చూస్తున్న రణం