Temples In Telangana: ప్రపంచంలో ఎన్నో అంతుచిక్కని అద్భుతాలు వాటి తాలూకు ప్రశ్నలు మనల్ని తొలిచి వేస్తూనే ఉంటాయి. వాటిల్లో కొన్ని మానవ నిర్మిత కట్టడాలు కూడా ఉన్నాయి. వాటి తాలూకా విశేషాలు అబ్బురపరుస్తాయి.
ఆ కోవకు చెందినదే ఈ ఛాయా సోమేశ్వర ఆలయం.
ఎక్కడ ఉంది?
హైదరాబాద్ నగరానికి 100 కి.మి ల దూరంలో ఉన్న నల్లగొండ జిల్లా కేంద్ర శివార్లలోని పానగల్లు ప్రాంతంలో ఉంది.
ఏంటి దీని ప్రత్యేకత?
నల్లగొండ జిల్లాలో పురాతనమైన ఆలయాల్లో ఛాయా సోమేశ్వర ఆలయం ఒకటి. ఈ గుడి పేరుకు తగ్గట్టు నీడ లోనే ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత అంటే ఈ గుడిలో శివలింగం మీద పడే స్తంభం నీడ. ఎనిమిది స్తంభాల ఈ గుడిలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కొన్నిసార్లు పౌర్ణమినాడు కూడా స్తంభం నీడ లింగం మీద అలాగే ఉంటుంది.
అయితే ఈ నీడ అక్కడ ఉన్న ఏ స్తంభానిది అని పరీక్షించినప్పుడు దేనిదో తేల్చుకోలేక పోతారు జనాలు. ఏ స్తంభం దగ్గర నిలబడ్డా ఆ మనిషి నీడ ఆ లింగం మీద పడదు. కానీ స్తంభం నీడ అలాగే ఉంటుంది. దాంతో జనాలు ఇది ఆ సోమేశ్వరుడి మహిమ గా నమ్ముతారు. అందుకే ఈ గుడికి “ఛాయా సోమేశ్వర ఆలయం” అని పేరు వచ్చింది.
నీడ దేవుడి మహిమేనా? ఇంకేదైనా కారణం ఉందా?
అయితే ఈ అంతుచిక్కని రహస్యం ఛేదించడానికి ఎంతో మంది ప్రయత్నించారు. కానీ సమాధానం దొరకలేదు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం సూర్యాపేట జిల్లాకు చెందిన శేషగాని మనోహర్ అనే ఫిజిక్స్ లెక్చరర్ దీనికి సమాధానం రాబట్టారు. వాస్తవానికి ఛాయా సోమేశ్వర ఆలయం ఒక త్రికూట ఆలయం. అంటే మూడు ఆలయాలు ఉన్న చోటు అన్నమాట.
పడమర దిక్కున సోమేశ్వర ఆలయం కాకుండా ఇంకో రెండు గుళ్ళు తూర్పు,ఉత్తరాన ఉంటాయి. ఆ గర్భగుళ్ళు చీకటిగా ఉంటాయి. ఇక్కడ గుడి మధ్య నాలుగు స్తంభాల మండపం నుండి చూస్తే ఎ గుడిని చూసినా ఒకేలా కొలతల్లో ఉన్నట్టు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నిర్మాణం అంతా కూడాను స్తంభాలతో కలిసి సుష్టమైన(symetrical) నిర్మాణం ఉంటుంది.
భౌతిక శాస్త్ర అద్భుతం
ఈ గుడి మిస్టరీ ని ఛేదించడానికి ఈ లెక్చరర్ గుడి నిర్మాణాన్ని నిశితంగా పరిశీలించారు.
ఆ తర్వాత మనోహర్ ఈ గుడి నమూనా ను థర్మకోల్, కొవ్వొత్తులను స్తంభాలుగా, టార్చ్ లైట్ లను వాడుకొని ప్రయోగం చేసాడు. ఆ ప్రయోగం ద్వారా తను ఇది భౌతిక శాస్త్ర నియమాలను అనుసరించి కాంతిని మళ్ళించిన అద్భుత కట్టడం అని తేల్చి చెప్పారు. కాంతి(Light) పరిక్షేపణం( scattering) ఆధారంగా కట్టారు. ఇక నీడ ఒక్క స్తంభానిది కాదు. నాలుగు స్తంభాలవి. ఇక్కడ నీడ పడుతుంది అంటే కాంతి ఎక్కడనుండి వస్తుంది అని పరీక్షించి చూసినప్పుడు ఎదురుగా తూర్పు గుడికి రెండు వైపుల నుండి మధ్యలో పడుతుంది. ఈ కాంతి ఆ నాలుగు స్తంభాలకు తాకి గర్భగుడిలోకి పరిక్షేపం(Scatter) అవుతుంది. ఇక్కడ ఆ కాంతి లింగం మీద పడుతుంది. తూర్పు నుండి పడమరకు సూర్యోదయం, సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి పడమర వైపు గుళ్లో మాత్రమే నీడ పడేలా నిర్మించారు. మిగిలిన చోట్ల నీడ పడకుండా విగ్రహాలు పెట్టి కాంతి పడకుండా చేశారు. ఉత్తరం వైపు గుడిలో నీడ పడకుండా దక్షిణం వైపు ఖాళీగా వదిలేశారు.
గుడి చరిత్ర
కాకతీయుల కాలంలో సామంత రాజులుగా “ఏరువ” రాజ్యానికి పానగల్లు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. అందుకే ఈ గుడి కాకతీయుల నిర్మాణ శైలి లో ఉంటుంది. 12వ శతాబ్దంలో ఈ గుడిని నిర్మించినట్లు అక్కడ లభ్యమైన శాసనాల ద్వారా చరిత్రకారులు చెబుతారు. ప్రతి సంవత్సరం శివరాత్రి, కార్తీక మాసం సమయాల్లో చాలా చోట్ల నుండి జనాలు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు.
ఛాయా సోమేశ్వర ఆలయం పక్కన ఉదయ సముద్రం అనే పెద్ద చెరువును తవ్వించారు. ప్రస్తుతం అది నల్లగొండ పట్టణం మరియు పరిసర ప్రాంతాల దాహార్తి తీరుస్తుంది.
ఈ గుడితో పాటు దానికి దగ్గర్లో పచ్చల సోమేశ్వర ఆలయం కూడా నిర్మించారు.
View this post on Instagram
మానవ పరిణామంలో ఎన్నో మార్పులకు విజ్ఞానం అనేది అత్యంత కీలకం.. ఇటువంటి మానవ అద్భుతాలను ఏదో రుజువుల్లేని నమ్మకాలు గా ప్రచారం చేయడం కంటే దీని వెనుక కృషిని, దీనికి తోడ్పడిన విజ్ఞానాన్ని, ఇది సృష్టించిన శిల్పులను మనం గుర్తించాలి.