అది 2011 అక్టోబర్ 15.. ప్రత్యేక రాష్ట్రం కోసం యావత్ తెలంగాణ చేపట్టిన సకల జనుల సమ్మె ఉధృతంగా సాగుతోన్న రోజులవి. టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ లాంటి పార్టీలతో సహా ప్రభుత్వ ఉద్యోగులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, లాయర్లు రోడ్లపైకి వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం నినదిస్తున్న కాలమిది. తెలంగాణ మొత్తం ఒకవైపు ఉంటే ఆ సమయంలో AIMIM పార్టీ మాత్రం మరోవైపు నిలిచింది. సకల జనుల సమ్మె వల్ల హజ్ యాత్రకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన కామెంట్స్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పట్ల ఆయన వైఖరికి నిదర్శనం. ఆ ఒక్కసారే కాదు.. తెలంగాణ మలి దశ ఉద్యమం మొదలైన నాటి నుంచి బహిరంగంగానే MIM పార్టీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది. 1984 నుంచి హైదరాబాద్ను ఏలుతున్న ఒవైసీ కుటుంబానికి తెలంగాణ ప్రజల బాధలు తెలియనవి కావు. అయినా ఆయనకు సొంత ప్రయోజనాలే ముఖ్యం.. ఏపీ రాజకీయ నాయకులు తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ఒక్కసారి కూడా ఒవైసీ ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఇదంత చరిత్ర.. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఒవైసీ ‘జై తెలంగాణ’ నినాదం ఎత్తుకున్నారు. అది కూడా పార్లమెంట్లో..!
Owaisi should be disqualified under article 102-1(d) pic.twitter.com/bYCN98bWX8
— Sameer (@BesuraTaansane) June 25, 2024
ఈ నినాదాలు ఎందుకు?
పార్లమెంట్లో రాజ్యంగబద్ధంగా ప్రమాణస్వీకారం చేయాల్సిన ఎంపీలకు నినాదాల పిచ్చి ముదిరింది. ఉద్యమాల సమయంలోనో, ఐక్యత కోసమో చేయాల్సిన నినాదాలను ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఎందుకు నినదిస్తున్నారో అర్థంకాని దుస్థితి దాపరించింది. ఒకరు జైశ్రీరామ్ అంటారు.. ఇంకోకరు జై భీమ్ అంటారు.. మరొకరు జై తమిళనాడు, జై తెలంగాణ.. ఇలా ఎవరికి నచ్చింది వాళ్లు అరుచుకుంటూ పోతారు. గొర్రెల మాదిరి ఒకరిని చూసి ఒకరు స్లోగన్స్ చేస్తారు. అలానే హైదరాబాద్ ఎంపీ ఒవైసీ కూడా నినాదాలు చేశారు. అది ఒక నినాదం కాదు.. ఏకంగా మూడు నినాదాలు చేశారు. జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని గట్టిగా నినదించారు. ఇందులో జై పాలస్తీనా నినాదం పట్ల పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. ఈ నినాదాన్ని రికార్డ్స్ నుంచి తొలగించనున్నారు కూడా. అయితే జై పాలస్తీనా నినాదాన్ని పక్కన పెడితే ఒవైసీ జై తెలంగాణ అని నినాదం చేయడం హాస్యాస్పదం!
నినాదాలు చేయాల్సిన అవసరం ఏముంది?
తెలంగాణ ఉద్యమం సమయంలో ఏనాడు రోడ్డు కూడా ఎక్కని ఒవైసీ హిపోక్రసీ పార్లమెంట్ వేదికగా బయటపడింది. సకల జనుల సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్కు MIM ఎప్పుడూ మద్దతు ఇవ్వదని అనేకసార్లు చెప్పిన ఆ ఒవైసీ సడన్గా జై తెలంగాణ నినాదం చేయడం విడ్డూరం. అటు జై పాలస్తీనా నినాదం కూడా అసందర్భంగా చేసిందే. అసలు ప్రమాణస్వీకార సమయంలో నినాదాలు చేయాల్సిన అవసరం ఏముంది? అందరూ ఎందుకు చేస్తున్నట్టు? ఇటు ఒవైసీకి ప్రమాణస్వీకారం సమయంలో పాలస్తీనా ప్రజలు బాధలు ఎందుకు గుర్తొచ్చినట్టు? పాలస్తీనా గురించి చర్చ జరగడం ఇండియాకూ ముఖ్యమే. ఎందుకంటే చరిత్రపరంగా పాలస్తీనాకు భారత్ అతి పెద్ద మద్దతుదారు.
బీజేపీతో సైలెంట్ స్నేహం:
అయితే 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో ఇండియా ద్వంద్వ వైఖరి పాటించింది. UNకి సంబంధించిన ఓటింగ్ల్లో పాలస్తీనాకు మద్దతు ఇవ్వాల్సింది పోయి ఓటింగ్ను ఎగొట్టింది(ABSTAIN). ముస్లింలపై ఒవైసీని నిజంగా అంత ప్రేమ ఉంటే పార్లమెంట్ చర్చల సమయంలో ఈ విషయంలో మోదీ సర్కార్ను ఎండగట్టవచ్చు. ఆ ఛాన్స్ ఒవైసీకి ఉంది కూడా. కానీ ఆ ప్రయత్నం కూడా చూడకుండా ప్రమాణస్వీకారం సమయంలో పాలస్తీనా పలుకులు పలకడం వింతగా అనిపిస్తోంది. పలు రాష్ట్రాల్లో బలం లేకున్నా పోటికి దిగడం, పరోక్షంగా కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల ఓట్లు చీల్చి బీజేపీ గెలుపుకు సాయం చేయడం MIMకు అలవాటు. ఓవైపు రాజకీయంగా బీజేపీకి సపోర్ట్గా ఉంటూనే మరోవైపు ఈ రకమైన నినాదాలు చేస్తూ తనకు తాను ఇంటెలిజెంట్గా జనాల్ని నమ్మించే ప్రయత్నం చేయడం ఒవైసీ నైజం. 40ఏళ్ల MIM పాలనలో ఓల్డ్ సిటీని ఏ మాత్రం అభివృద్ధి చేయని ఒవైసీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలస్తీనా కోసం నిలబడుతుండడం విస్మయాన్ని కలిగిస్తోంది.
Also Read: పేపర్ లీక్ల రాజధానిగా ఇండియా.. కోట్లాది మంది జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం!