వాక్సిన్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ మరొక వ్యాక్సిన్ ఆవిష్కరణకు వేదికైంది. లివర్ వ్యాధుల్లో ఒకటైన “హెపటైటిస్- ఎ “కు చెక్ పెట్టే టీకాను పూర్తిగా స్వదేశంలో అభివృద్ధి చేశారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB) ఆధ్వర్యంలోని అనుబంధ సంస్థ అయిన ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్(IIL), భారత్కు చెందిన బయోఫార్మసిటికల్ కంపెనీ కలిసి సంయుక్తంగా వ్యాక్సిన్ తయారు చేశారు. “హావిషూర్” పేరుతో దీనిని మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
దేశీయ ఆర్థిక వ్యవస్థకు బలం:
కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం ద్వారా సంక్రమించే అంటువ్యాధి కాలేయానికి సోకే రోగమే హెపటైటిస్-ఏ.ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా ప్రజలు హెపటైటిస్-ఎ బారిన పడుతున్నారని అంచనా. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 30,000 మంది మరణిస్తున్నారు. దీనికి సంబంధించిన టీకాను ఇన్ని రోజులు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇకనుంచి కేవలం దేశ అవసరాలకే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో రకాల వాక్సిన్ల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా ఉంది. తద్వారా ఆత్మ నిర్భరభారత్ ట్యాగ్లైన్ కు దిక్సూచిగా నిలిచింది.
ఎలా వినియోగించాలి?
ఈ హావిషూర్ వ్యాక్సిన్ పిల్లల, కౌమార, వయోజన వినియోగం కోసం తయారు చేశారు. రెండు-డోసుల ఇన్యాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది. ఒక్కో వ్యాక్సిన్ ధర రూ. 2,150 ఉంటుందని ఐఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె ఆనంద్ కుమార్ తెలిపారు. ఇది ఇంట్రామస్కులర్ ఇంజెక్టబుల్ వ్యాక్సిన్, ఆరు నెలల గ్యాప్లో ఇవ్వబడుతుంది. ఫేజ్ II/III 12 నెలల వయస్సు ఉన్న పిల్లలు, కౌమారదశ, 49 ఏళ్లలోపు పెద్దలు సహా 500 మంది వాలంటీర్లపై పరీక్షించారు. వ్యాక్సిన్ ట్రయల్స్ 2022 ప్రారంభంలో ముగియగా, గత ఏడాది సెప్టెంబర్లో డ్ర*గ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఈ టీకాకు అనుమతి లభించింది. హైదరాబాద్, మైసూరు, పూణె, చండీగఢ్, వైజాగ్, కోల్కతా లాంటి నగరాల్లోని కేంద్రాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు.
Also Read: రాత్రివేళ ఇన్స్టాలో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడుపుతున్నారా?
1 Comment