40 ఏళ్ళ రవి ఒక ప్రైవేటు ఉద్యోగి. అందరిలాగే తనకు కూడా ఆరోగ్యసమస్యలు వస్తుంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్యలు సాధారణమే కదా అనుకున్నాడు. అయితే తనకు ఏ చిన్న నొప్పి వచ్చినా లేదా ఏ రోగం వచ్చినా డాక్టర్ చెప్పినా చెప్పకున్నా ఏదో ఒక మాత్ర మాత్రం మింగేస్తుంటాడు. ఇలా తన లైఫ్ మూడు రోగాలు.. నాలుగు ట్యాబ్లెట్లతో కొనసాగుతున్న సయయంలో తన శరీరంలో ఏదో మార్పు జరుగుతున్నట్టు గమనించాడు. కొన్ని వారాలుగా శారీరకంగా ఇబ్బందులు పడుతున్నాడు. కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నాడు. నడిస్తే కాళ్ళు విపరీతంగా నొప్పి పెడుతున్నాయి.. ఆయాసం కూడా వస్తోంది. శరీరంలో ఖనిజాల లోపం వల్ల అయ్యుండొచ్చు అని భావించాడు. కొన్నాళ్ళు గడిచినా అవి తగ్గకపోగా సమస్యలు మరింత పెరిగాయి. దీంతో ఒక డాక్టర్ను కలిశాడు. డాక్టర్ టెస్టులు చేయాలన్నాడు..రవి చేయించుకున్నాడు. ఆ టెస్టు రిజల్ట్ చూశాక రవి షాక్ అయ్యాడు. శరీరంలో క్రియాటిన్ మోతాదు పెరిగి, తన కిడ్నీలు దెబ్బతిన్నాయని టెస్టుల్లో తేలింది.క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD) అనే వ్యాధి వచ్చిందని డాక్టర్ చెప్పాడు.
అతిగా మాత్రాలు వేసుకుంటే ఏం అవుతుంది?
ఎప్పుడూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాధులు రాకుండా మాత్రలు వేసుకుంటున్నానని భావించే రవికి డాక్టర్ మాటలు షాకింగ్కు గురిచేశాయి. అసలు తనకు ఎందుకు ఇలాంటి వ్యాధి వచ్చిందో తెలుసుకోవాలనుకున్నాడు. డాక్టర్కు తన డౌట్ క్లారిఫై చేయాలని అడిగాడు. నిజానికి కిడ్నీలు పాడవ్వడానికి రకరకాల కారణాలు ఉంటాయి. డయాబెటిస్తో హైపర్టెన్షన్ దీనికి ప్రధాన కారణాలగా చెబుతుంటారు. అటు జన్యుపరమైన రీజన్స్ వల్ల కూడా కిడ్నీకి సంబంధించిన వ్యాధులు వస్తాయని చాలా మందికి అవగాహన ఉంది. ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ గ్రీన్కు పుట్టినప్పటి నుంచి జన్యుపరమైన లోపాలు ఉన్నాయి..దాని కారణంగా అతను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక దురాలవాట్ల వల్ల కూడా కొంతమంది ఈ తరహా రోగాలు బారిన పడుతుంటారు. కానీ రవికి ఇవేవీ కారణాలు కాదు. అతిగా ట్యాబ్లెట్లు వేసుకోవడమే అతని కొంపముంచింది. చీటికి మాటికి అవసరం లేకున్నా మందులు వేసుకుంటే కిడ్నీలు పాడవ్వడానికి అవకాశం ఉంటుందని డాక్టర్ చెప్పడంతో రవికి తన తప్పు తెలిసి వచ్చింది.
కిడ్నీలు ఓసారి పాడైతే మళ్ళీ వాటిని కోలుకునేలా చెయ్యలేం. జీవితాంతం డయాలసిస్ అనే చికిత్స పొందుతూ ఉండాలి, లేదా మరొకరి కిడ్నీని రోగికి అమర్చాలి. దీంతో రవి చేసేదేమీలేక కిడ్నీ దాతల కోసం ఎదురుచూస్తూ ప్రస్తుతుం డయాలసిస్ చేసుకుంటూ బతుకీడుస్తున్నాడు.
కిడ్నీలు చాలా అమూల్యమైనవి :
మన శరీరంలో రక్తాన్ని శుద్ధిచేసే అత్యంత కీలకమైన పాత్ర మన రెండు కిడ్నీలు చేస్తాయి. వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సరైన పోషకాహారం తీసుకుంటూ, సరిపడా నీళ్ళు తాగడం ఇంకా వ్యాయామం చేయడం లాంటివి చేయాలి.
ఏం చేయాలి? ఏం చెయ్యకూడదు!
కిడ్నీలు పాడవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే వాటిల్లో ప్రధానమైనవి డయాబెటిస్, హైబీపీ. 90% పైగా కేసుల్లో ఈ రెండు కారణాల వల్లే కిడ్నీ బాధితులు పెరుగుతున్నారు. కాబట్టి ఎప్పుడూ బీపీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి. నిరంతరం టెస్టులు చేస్తూ నిర్థారణ చేసుకోవాలి. ఆహారపు అలవాట్లను నిపుణుల సలహా మేరకు వీలైనంత ఆరోగ్యకరంగా మార్చుకోవాలి. వ్యాయామాలు చేయడం లాటివి చేయాలి. నీళ్ళు తాగడాన్ని అశ్రద్ధ చేయకూడదు.
ఇక పొగ త్రాగడం, అతిగా మద్యం సేవించడం, అవసరం లేకున్నా మందులు సొంతంగా వాడటం వంటివి చెయ్యకూడదు.మూత్ర ఇన్ఫెక్షన్లు వంటివి వస్తే డాక్టర్ ను సంప్రదించాలి. లేదంటే కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉంటాయి.
ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యానికి సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించకుండా అనేక సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాము. సరైన ఆరోగ్యకర జీవన విధానాన్ని అవలంబిస్తే కిడ్నీ రోగాలు లాంటివి అనేకం కట్టడి చేయొచ్చు.
1 Comment