Menu

Humanity: సికింద్రాబాద్‌లో మొదలైన జార్జ్ నిశ్శబ్ద విప్లవం.. ఆకలిని గౌరవంగా ఎదుర్కొన్న ఒక ఆలోచన!

Lakshmi Aruna 2 months ago
At Secunderabad Railway Station, a quiet queue forms each morning—not marked by impatience, but by dignity.

మనిషి జీవితంలో ఆకలి అనేది ఎంత ముఖ్యమైనదో మనం ఎవరికీ చెప్పనక్కర్లేదు. అది కేవలం శరీరానికి సంబంధించిన సమస్య కాదు. అది మన ఆత్మను మెల్లగా కుంగదీసే స్థితి. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మనిషి ఆలోచనలు కూడా ఖాళీ అయిపోతాయి. నిర్ణయాలు చాలా చిన్నవైపోతాయి. కలలు దూరమైపోతాయి. ఆకలి మనిషిని అమాంతం బలహీనంగా చేయదు, ముందుగా అతని గౌరవాన్ని దెబ్బతీస్తుంది. తినడానికి లేనప్పుడు మనిషి తనను తాను చిన్నవాడిగా భావించడం మొదలుపెడతాడు. అతని లోపల ఉన్న ధైర్యం మెల్లగా మసకబారుతుంది. ఎవరికైనా ఏదైనా అడగాల్సిన పరిస్థితి వస్తుందేమో అనే భయం అతన్ని వెంటాడుతుంది. ఆకలి అనేది కడుపులో మంట మాత్రమే కాదు, మనసులో మౌనం కూడా.

ఒక ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక వ్యక్తి నిలబడి వున్నాడు. అతని జీవితం మనకు తెలియదు. కానీ అతని పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది. అతని చేతిలో ఉన్న ఒక్క రూపాయి అతని ముందు ఉన్న ఎంపికలన్నిటినీ కుదించేసింది. కడుపులో ఆకలి. చేతిలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే వుంది. కనీసం ఆ రూపాయికి టీ కూడా రాదు ఈరోజుల్లో. ఒకవేళ వచ్చినా కూడా ఆ రూపాయి టీకి ఖర్చు చేస్తే ఆకలి తీరదు. ఆకలిని భరిస్తే శరీరం కుంగిపోతుంది. ఈ రెండింటి మధ్య ఇరుక్కున్న మనిషి, నిజానికి జీవితం ఏమిటి అని ఆలోచించే స్థితిలో ఉండడు. అతని ప్రపంచం ఆ ఒక్క రూపాయి వరకే పరిమితం అవుతుంది. ఆ క్షణంలో అతనికి రేపటి కలలు అవసరం ఉండవు. ఈ రోజు గడిస్తే చాలు అనే భావన మాత్రమే మిగులుతుంది. జీవితం ఎంత చిన్నగా మారిపోతుందో ఆకలి మనకు అక్కడ చూపిస్తుంది.

అలాంటి మనిషికి దూరంగా ఒకచోట ఒక క్యూ కనిపించింది. ఆహరం పంచిపెడుతున్నారని అక్కడికి వెళ్లి ఆ క్యూలో నిలబడినప్పుడు అక్కడ జరిగేది ఆహారం పంపిణీ కాదు. ప్రతి మనిషి గౌరవాన్ని తిరిగి ఇవ్వడం. అక్కడ ఆహారం అందించేవారు అతని పేరు అడగరు. అతని గతాన్ని విచారించరు. అతని అవసరాన్ని ప్రశ్నించరు. ఆ రూపాయికి అతని చేతిలో ఒక ప్లేట్ ఉప్మా, ఒక గుడ్డు, ఒక గ్లాస్ టీ పెట్టడం ద్వారా ఒక మాట చెప్పినట్టవుతుంది. నువ్వు కూడా ఈ సమాజంలో ఒక భాగమే. అది దానం కాదు. గౌరవంతో తినే అవకాశం. ఆ ప్లేట్‌లో ఉన్నది కేవలం ఆహారం కాదు. అది ఒక నమ్మకం. ఇక్కడ నిన్ను ఎవరూ తక్కువగా చూడరు అనే భరోసా. క్యూలో నిలబడ్డ ప్రతి మనిషి కళ్లలో ఒక చిన్న వెలుగు కనిపిస్తుంది. అది కడుపు నిండబోతుందనే ఆనందం కాదు, గౌరవం దక్కిందనే సంతృప్తి.

ఈ ఆలోచన వెనుక ఉన్న వ్యక్తి పేరు జార్జ్ రాకేష్ బాబు. ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభించిన “కరుణ కిచెన్” నిశ్శబ్దంగా పనిచేస్తుంది. అది కేవలం ఒక వంటగది మాత్రమే కాదు. అది మన సమాజం తనను తాను చూసుకునే ఒక అద్దం. ఇక్కడ భోజనం ధర ఒక్క రూపాయి. ఈ ధర డబ్బు కోసం కాదు. ఈ ధర మనిషి స్వాభిమానానికి. ఆ రూపాయి కూడా లేకున్నా ఎవర్ని అక్కడ తిరస్కరించరు. ఇది కేవలం తినేవాళ్లు తమను తాము దయ మీద బతికే వాళ్ళుగా కాకుండా, గౌరవంగా జీవించే మనుషులుగా భావించాలి అనే ఉద్దేశంతో పెట్టిన ధర. పూర్తిగా ఉచితంగా ఇస్తే మనిషి తీసుకుంటాడు, కానీ కొంత లోపల బాధ పడతాడు. ఒక్క రూపాయి చెల్లిస్తే అతను తినటం మాత్రమే కాదు, ఎవరి దగ్గరో చేయి చాచాను అనే భావనతో బతకడు. ఈ చిన్న ఆలోచనలోనే ఒక పెద్ద మానవత్వం దాగి ఉంది. మనిషిని నిలబెట్టేది ఆహారం కాదు, అతని ఆత్మవిశ్వాసం.

ఆకలితో మొదలైన రోజు ముందుకు సాగదని జార్జ్ గారు నమ్ముతారు. ఎందుకంటే ఆకలితో ఉన్న మనిషి భవిష్యత్తు గురించి ఆలోచించలేడు. అతనికి ఈ రోజు గడవడమే ఒక పోరాటం. ఉదయం భోజనం అందించడం అంటే ఒక రోజు మాత్రమే కాదు, ఆ రోజు లోపల ఉన్న అవకాశాలను తిరిగి ఇవ్వడం. ఆహారం అనేది ఇక్కడ శక్తి కాదు. అది అవకాశానికి తలుపు. ఈ సేవలో పెద్ద శబ్దం లేదు. ప్రచారం లేదు. గొప్ప గొప్ప మాటలు లేవు. ఎందుకంటే నిజమైన మానవత్వానికి చప్పట్లు అవసరం ఉండవు. ఉదయం సుమారు 250 మందికి, మధ్యాహ్నం మరో 350 మందికి భోజనం అందుతుంది. ఈ సంఖ్యలు పెద్దగా అనిపించవు. కానీ ప్రతి సంఖ్య వెనుక ఒక జీవితం ఉంటుంది. ఒక రోజు గౌరవంతో గడిపే అవకాశం ఉంటుంది. ఈ ఆలోచనకు ప్రేరణ ఢిల్లీలోని “జన్ రసోయి” నుంచి వచ్చినా, జార్జ్ గారు దీనిని హైదరాబాద్ జీవనంతో కలిపారు. ఇప్పుడు ఆయన కల ఈ సేవను నగరం అంతా విస్తరించాలి అనే ఒక్కటే. ఎక్కువ మందికి ఆహారం ఇవ్వడం కంటే, ఎక్కువ మందికి గౌరవంతో బతకే అవకాశం ఇవ్వడం ఆయన లక్ష్యం. ఎందుకంటే మార్పు అనేది సంఖ్యలతో కాదు, మనుషుల జీవితాల్లో వచ్చే చిన్న వెలుగుతో కొలవాలి.

ఈ కథ మనల్ని ఒక అసౌకర్యమైన ప్రశ్న అడుగుతుంది. మన కడుపు నిండిన తర్వాత మన చుట్టూ ఉన్న ఆకలిని మనం గమనిస్తున్నామా లేదా అనేది. మనం ఆకలిని సమస్యగా చూస్తున్నామా, లేక దృశ్యంగా మాత్రమే చూస్తున్నామా? ఎందుకంటే ఆకలి మనకు కనిపించకపోతే అది ఉండదని కాదు. మనం చూడకపోవడమే మన అలవాటు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అసలు విలువైన కరెన్సీ డబ్బు కాదు, అధికారము కాదు. మనిషి మరో మనిషికి చూపించే కరుణ. జార్జ్ రాకేష్ బాబు లాంటి వాళ్లే ఈ సమాజంలో నిజంగా మార్పు తీసుకొచ్చే వ్యక్తులు. నిజమైన సంపద ఎక్కువ సంపాదించడం కాదు. అవసరమైనప్పుడు మనిషిలా ఉండగలగడం. జార్జ్ రాకేష్ బాబు చేసే పని మనకు ఇదే గుర్తు చేస్తుంది. సమాజాన్ని మార్చడానికి పెద్ద పెద్ద విప్లవాలు అవసరం లేదు. ఒక మనిషి ఆకలిని గౌరవంతో తీరుస్తే చాలు, ఆ మార్పు నిశ్శబ్దంగా మొదలవుతుంది. మనము ఇచ్చే ఒక ప్లేట్ భోజనం ఎవరికో ఒక రోజు కాదు, ఒక దృష్టికోణాన్ని మార్చవచ్చు.

ALSO READ: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *