Gautam Gambhir as Team India New Head Coach? : ఇండియన్ క్రికెట్ బోర్డు(బీసీసీఐ)ను ఎంతోమంది రాజకీయ పెద్దలు ముందుండి నడిపించారు. శరద్ పవార్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఇండియన్ క్రికెట్లో ఎక్కడా కూడా పొలిటికల్ ఫ్లేవర్ కనిపించలేదు. అటు జగన్మోహన్ దాల్మియా లాంటి వాళ్లు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. వీరంతా క్రికెటర్లు కాదు. అయినా బోర్డును గొప్పగానే నడిపారు. కానీ 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియన్ క్రికెట్లోకి కాషాయం ఎంట్రీ ఇచ్చింది.. ముందు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసే జెర్సీలో కాషాయ రంగు కనిపించింది. మొత్తంగా బ్లూగా ఉండే ఇండియన్ టీమ్ జెర్సీలోకి కూడా ఇదే రంగు అంటి అంటినట్టుగా కనపడింది. ఇండియాలో స్పోర్ట్స్ను ఆదరించేవాళ్లకు బ్లూ అంటే ఎమోషన్. అందుకే మొత్తంగా కాషాయ రంగు చేసే సాహసం బీజేపీ నేతృత్వంలోని క్రికెట్ బోర్డు పెద్దలు చేయలేకపోయారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మొత్తం ఇండియన్ క్రికెట్ పెత్తనమంతా అమిత్షా కొడుకు, బీసీసీఐ సెక్రటరీ జై షా చేతిలోకి వెళ్లడం మరో ఎత్తు. అందుకు తాజాగా జరుగుతున్న పరిణామాలే గొప్ప ఉదాహరణ.
THE BCCI APPROACHED GAUTAM GAMBHIR FOR HEAD COACH POSITION. (Espncricinfo). pic.twitter.com/C11a3uFgIo
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 17, 2024
ముందు నుంచే ప్లాన్ చేశారు:
టీమిండియాకు రెండు(టీ20, వన్డే) ప్రపంచకప్లు అందించడంలో గౌతమ్ గంభీర్ పాత్ర మరువలేనిది. 2007 టీ20 వరల్డ్కప్, 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్లో గంభీర్ ఆట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అయితే గంభీర్కు రావాల్సినంత గుర్తింపు రాలేదన్నది అక్షరాల నిజం. ఫామ్లేక కొంతకాలం ఇబ్బంది పడ్డ గంభీర్ ధావన్ ఎంట్రీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు దూరమయ్యాడు. కానీ అదే సమయంలో ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్గా సత్తా చాటాడు. షారుఖ్ టీమ్కు రెండు ఐపీఎల్ ట్రోఫిలు అందించాడు. ఆటగాడిగా, కెప్టెన్గా గంభీర్ తానెంటో నిరుపించుకున్నాడు. 2024 ఐపీఎల్లో కోల్కతా మెంటర్గానూ తన మార్క్ చూపిస్తున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో బీసీసీఐ గంభీర్ను హెడ్కోచ్గా ఉండాలని సంప్రదించిందన్న వార్తలు హాట్ టాపిక్గా మారాయి. అయితే ఇదంతా ఏ రాత్రికి రాత్రో జరిగిన విషయం కాదు.. దీని వెనుక నెలల తరపడి ప్లాన్ ఉందని అర్థమవుతోంది.
పెరుగుతున్న బీజేపీ జోక్యం:
గంభీర్ 2019లో ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ తరుఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందాడు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పోటి చేయనని మార్చి 2న ప్రకటించాడు. క్రికెట్కు ఎక్కువ టైమ్ కేటాయించాలని అనుకుంటున్నట్టు బీజేపీకి రిక్వెస్ట్ చేశాడు. అతని స్థానంలో బీజేపీ మరో అభ్యర్థిని నిలబెట్టింది. ఇక ఐపీఎల్ టైమ్లో కోల్కతా వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ-గంభీర్ ముచ్చట్లు సోషల్మీడియాలో షేర్ అయ్యాయి. వారి ఫ్రాంచైజీలు తమ అఫిషియల్ యూట్యూబ్ ఛానెల్స్లోనూ ఈ వీడియోలు పెట్టాయి. ఈ ఇద్దరు మంచిగా మాట్లాడుతున్న ఫొటోలను హైలేట్ చేస్తూ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. గతేడాది లక్నో వర్సెస్ బెంగళూరు మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఇద్దరు కొట్టుకునే అంత పని చేశారు. మరి గంభీర్ హెడ్కోచ్గా వస్తే కోహ్లీతో విభేదాల గురించి అనేక ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే వారిద్దరు సఖ్యతగా ఉన్నట్టు ఫ్యాన్స్ మైండ్ను మార్చే విధంగా ఈ సీన్ను క్రియేట్ చేసినట్టుగా టాక్ నడుస్తోంది. ఇలా మొత్తానికి హెడ్కోచ్గా గంభీర్ తన లైన్ను క్లియర్ చేసుకున్నారు. ప్లేయర్గా, మెంటర్గా సక్సెస్ అయిన గంభీర్ హెడ్కోచ్గానూ రాణించాలని అందరూ కోరుకుంటున్నారు. హెడ్కోచ్గా అతను ఎంపిక అవడం లాంఛనమే! క్రికెట్ ఫ్యాన్స్రాజకీయాలను పెద్దగా పట్టించుకోరు కానీ బీసీసీఐలో మాత్రం బీజేపీ జోక్యం పెరిగిందని క్లియర్కట్గా అర్థమవుతోంది!
ALso Read: మూడు నాలుకల సిద్ధాంతం.. ముస్లిం రిజర్వేషన్లలో కూటమిది తలో మాట!