Menu

Donald Trump Tariffs: ట్రంప్‌ తలతిక్క పనులు.. అమెరికాకే ఎసరు..ఈ లెక్కలే సాక్ష్యం!

Lakshmi Aruna 1 week ago
donald trump tariffs

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ విదేశాంగ విధానంలో టారిఫ్‌లు కేంద్రబిందువుగా మారాయి. వాణిజ్యం, భద్రత, దౌత్యం.. ఏ అంశమైనా చివరకు సుంకాల బెదిరింపులకే పరిమితం అవుతోంది. గ్రీన్‌లాండ్ నుంచి ఇరాన్ వరకు, చైనా నుంచి రష్యా వరకు.. ట్రంప్ విధానంలో టారిఫ్‌లు ఒక రాజకీయ ఆయుధంగా మారినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే ఈ దూకుడు విధానం వల్ల ఇతర దేశాలకంటే అమెరికాకే ఎక్కువ నష్టం జరుగుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ, అమెరికా దిగుమతులపై అధికంగా ఆధారపడే వినియోగ దేశం. దుస్తులు, చెప్పులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, సెమీకండక్టర్ చిప్స్, ఔషధాలు వంటి కీలక వస్తువులన్నీ పెద్ద ఎత్తున విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి.

ముఖ్యంగా టెక్నాలజీ రంగానికి అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో అమెరికా ఇప్పటికీ చైనా సరఫరాపైనే ఆధారపడుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా తయారీ రంగం క్షీణించడంతో, అమెరికా సేవా రంగంపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ పరిస్థితిలో దిగుమతులపై సుంకాలు పెంచడం అంటే విదేశీ కంపెనీలపై కాకుండా, అమెరికన్ వినియోగదారులపై భారాన్ని మోపినట్టేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టారిఫ్‌ల పెంపు కారణంగా దిగుమతి వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా అమెరికాలో ద్రవ్యోల్బణ ఒత్తిడి మళ్లీ పెరుగుతోంది. ట్రంప్ ప్రభుత్వం “సుంకాలు ఇతర దేశాలు చెల్లిస్తున్నాయి” అని వాదిస్తున్నప్పటికీ, వాస్తవంలో ఆ భారం స్థానిక మార్కెట్‌లో ధరల రూపంలో ప్రజలకే చేరుతోందని విశ్లేషకుల అభిప్రాయం.

ఇక ప్రపంచ దేశాల స్పందన కూడా మారుతోంది. గతంలో ట్రంప్ బెదిరింపులకు లోనైన దేశాలు ఇప్పుడు ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్నాయి. యూరోపియన్ యూనియన్, చైనా, భారత్ వంటి ప్రధాన ఆర్థిక శక్తులు అమెరికా సుంకాలకు సమాధానంగా తమవైపు కూడా సుంకాలు పెంచుతున్నాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను మరింత సంక్లిష్టంగా మారుస్తోంది.

భారత్‌పై విధించిన టారిఫ్‌లకు ప్రతిస్పందనగా, అమెరికా నుంచి దిగుమతి అయ్యే పప్పు ధాన్యాలపై భారత్ 30 శాతం సుంకం విధించింది. నార్త్ డకోటా, మోంటానా వంటి రాష్ట్రాల్లో పప్పు ధాన్యాల ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో, ఈ నిర్ణయం అమెరికన్ రైతులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. మొత్తంగా ట్రంప్ టారిఫ్ విధానం తాత్కాలిక రాజకీయ లాభాలు తీసుకొచ్చినా, దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు పెరుగుతున్నాయి. వాణిజ్య యుద్ధాలు ప్రపంచ మార్కెట్లను అస్థిరపరిచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ALSO READ: ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక.. గల్ఫ్ ప్రాంతంలో పెరిగిన సైనిక ఉద్రిక్తత!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *