Menu

Chernobyl: చరిత్రను మరిచిన రష్యా.. చెర్నోబిల్‌ మరోసారి మృతభూమిగా మారుతుందా?

Praja Dhwani Desk 12 months ago
chernobyl power plan russia drone attack

చీకటి నదుల్లా వ్యాపిస్తున్న నీడలు.. రాత్రి నిశ్శబ్దంలో గుసగుసలాడే మరణపు గాలులు… ఒకప్పుడు మౌనంగా నిలిచిన చెర్నోబిల్(Chernobyl), ఇప్పుడు మళ్లీ భయంతో తడబడుతుంది..! చరిత్రలో అతి పెద్ద అణు ప్రమాదానికి వేదికైన చెర్నోబిల్‌ను మళ్లీ మృత్యువు తలుపుతట్టింది. రష్యా డ్రోన్ల దాడిలో రియాక్టర్‌ను కప్పి ఉంచిన షెల్టర్‌ దెబ్బతినడంతో మంటలు చెలరేగాయి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ-IAEA ప్రకారం ప్రస్తుతం రేడియేషన్ స్థాయిల్లో మార్పు లేదు. కానీ చెర్నోబిల్ ప్లాంట్ చీఫ్ ఇంజనీర్ చెబుతున్న మాట భయం పుట్టిస్తోంది. రేడియేషన్ లీక్ అయ్యే అవకాశం ఉందంటూ ఆయన బాంబు పేల్చారు. అటు ఈ ఘటనపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా న్యూక్లియర్ రియాక్టర్‌పై కూడా దాడి చేస్తామని పరోక్షంగా బెదిరింపులకు దిగారు. ప్రపంచ భద్రతకు, మనిషి మనుగడకూ ప్రమాద ఘంటికలు మోగినట్టుగా అనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు జెలెన్‌స్కీ. అటు రష్యా మాత్రం ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని వాదిస్తోంది. అణు భద్రతను గౌరవిస్తామని చెబుతోంది. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అటు ప్రపంచం మాత్రం ఈ రక్తపాతం ఎక్కడ ఆగుతుందో అర్థం అవ్వక తల పట్టుకుంటోంది.

ఎవరి పని?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పుతిన్‌తో చర్చలు జరిపి యుద్ధం ముగించాలని ప్రకటించిన కాసేపటికే ఈ ఘటన జరిగింది. అంతేకాదు, జర్మనీలో మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ప్రారంభానికి కేవలం కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం సంచలనంగా మారింది. ఈ సమావేశంలో జెలెన్‌స్కీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మధ్య అణు భద్రత గురించి పెద్ద చర్చ జరగాల్సి ఉందన్న వార్తల సమయంలోనే ఈ ఘటన జరిగింది.

1986 పునరావృతమా?

నిజానికి దశాబ్దాల కృషి, బిలియన్ల డాలర్ల నిధులు వెచ్చించి నిర్మించిన కాంక్రీటును ఒక రాత్రిలోనే ఈ దాడి దెబ్బతీసింది. ఈ దాడి ప్రపంచ భద్రతపై ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఇది కేవలం యుక్రెయిన్‌కు సమస్య కాదు.. ఇది యూరప్‌ మొత్తానికి చెందినది. ఎందుకంటే రేడియేషన్ బయటకు లీక్ అయితే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. గాలి ప్రవాహాలతో ఆ రేడియేషన్‌ యూరప్ అంతా వ్యాపిస్తే ఎంతోమంది చనిపోతారు. ఇప్పటికీ చెర్నోబిల్ తలుపుల దగ్గర దశాబ్దాలుగా ఓ అణు భూతం మౌనంగా నవ్వుతోంది. అది 1986 నాటి విషయం. 1986లో జరిగిన విపత్తు, కొన్ని తరాలను నాశనం చేసింది. ఏప్రిల్ 26 తేది వస్తేనే చరిత్ర వణుకుతుంది. దశాబ్దాల శ్రమతో నిర్మించిన అణు భద్రతా వ్యవస్థ ఒక రాత్రిలోనే ఆ నాడు కరిగిపోయింది. అక్కడ నాలుగో రియాక్టర్ దహనమైంది. పేలుడు ధాటికి రెయాక్టర్ పైకప్పు ఎగిరిపోయింది. అణు బంకర్ ఛిద్రమైంది. కెమెరాల కళ్లకు కనిపించని రేడియేషన్‌ గాలి తాకిన ప్రతి మనిషిని ముప్పుతిప్పలు పెట్టింది. కొంతమందిని కొన్ని గంటల్లోనే శవాలుగా మార్చింది. మిగతావాళ్లు కొన్ని రోజులు గడిచాక మృత్యువుకు బలయ్యారు. చాలా మంది క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఇదొక చిన్న ప్రమాదం మాత్రమే అని సోవియట్ యూనియన్ మొదట ప్రకటించింది.

చెర్నోబిల్‌ భవిష్యత్తు ఏంటి?

30 రెట్లు హిరోషిమా అణు బాంబ్ కన్నా ఎక్కువ శక్తి విడుదలైన ఆ రోజు 2 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి పరుగులు తీశారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాల్లో లక్షలాది ప్రజలు లుకీమియా బారిన పడ్డారు. అప్పటి ప్రమాదానికి అజాగ్రత్త కారణం.. కానీ ఇప్పటి దాడి యుద్ధన్మోదానికి పరాకాష్ట. చెర్నోబిల్‌ను కాపాడటానికి నిర్మించిన షెల్టర్‌పై డ్రోన్ దాడి జరగడం.. ఇది మా పని కాదంటే మా పని కాదని యుక్రెయిన్‌, రష్యా వాదించుకోవడం సంగతి పక్కన పెడితే ఇది ఎక్కడకి దారి తీస్తుందో తెలియని పరిస్థితి. 1986లో మానవ తప్పిదం మానవాళికి శాపంగా మారితే.. 2025లో మానవ క్రూరత్వం.. మరొక విపత్తును తెచ్చేస్తుందా అనే భయాలు నెలకొన్నాయి.

ALSO READ: మానవ హక్కులను కాలరాస్తున్న తలోజా జైళ్లు.. లోపలికి వెళ్లడమే కానీ బయటకు రాలేం..!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *