ఏడాదికి లక్షా 80 వేల మరణాలు.. ఇది ప్రపంచవ్యాప్తంగా అగ్నికీలలకు ప్రతీ ఏటా బలైపోతున్న వారి లెక్క! అగ్నిప్రమాద ఘటనలకు చనిపోతున్న వారిలో ప్రతి ఐదుగురిలో ఒక్కరు ఇండియాకు చెందిన వారే ఉంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక అనకాపల్లి జిల్లా(Anakapalli district) రాంబిల్లి మండలం అచ్యుతాపురం(Atchutapuram) ఫార్మా సెజ్లో జరిగిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇక ఇండియాలో ఈ తరహా అగ్ని ప్రమాదాలు తరుచుగా జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అటు ప్రపంచాన్ని తీవ్రంగా గాయపరిచిన అగ్ని ప్రమాదాల లిస్ట్ కాస్త ఎక్కువగానే ఉంది!
జపాన్ను కాల్చేసిన భారీ భూకంపం
కొన్నిసార్లు భూకంపాలు అగ్నిప్రమాదాలకు కారణం అవుతాయి. భూకంపం సంభవించిన తర్వాత ఇళ్లలో గ్యాస్ సిలిండర్ లికై ప్రజలు మరణించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. జపాన్-కాంటాలో 1923లో సంభవించిన భూకంపంలో లక్షా 50 వేల మందికి పైగా ప్రాణాలు విడిచారు. వీరిలో చాలామంది తమ ఇంట్లోని గ్యాస్ లికై మరణించారు. అటు ఇటలీ-సిసిలీలో 1908లో వినాశకరమైన భూకంపం సంభవించింది. ఆ తర్వాత దేశంలోని చాలా ప్రాంతాల్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ విషాదకర ఘటనలో దాదాపు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ మంటలు ఎలా వ్యాపించాయి?
1871 అక్టోబర్లో అమెరికాలోని చికాగో(Chicago)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇప్పటివరకు ఈ ప్రమాదానికి కారణమేంటో మిస్టరీగానే మిగిలిపోయింది. సెంట్రల్ సిటీ ప్రాంతంలో దాదాపు 8.5 చదరపు కిలోమీటర్లు భూమి ధ్వంసమైంది. 17,500 భవనాలకు మంటలు వ్యాపించాయి. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు 300 మందికి పైగా ప్రాణాలు విడిచారు.
తొక్కిసలాటకు చిన్నారులు బలి
డిసెంబర్ 23, 1995లో భారత్-హర్యానా(Haryana)లోని మండిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడి DAV పబ్లిక్ స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకల కోసం దాదాపు 1500 మంది తల్లిదండ్రులు, పిల్లలు హాజరయ్యారు. రాజీవ్ మ్యారేజ్ ప్యాలెస్ ప్రాంగణంలోని పందిరి కింద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ జనరేటర్లో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషం వ్యవధిలో మంటలు వ్యాపించడంతో ప్రధాన ద్వారం దగ్ధమైంది. ఈ దారుణ ఘటనలో 258 మంది చిన్నారులు సహా 500 మందికి పైగా ప్రజలు చనిపోయారు. నిజానికి ఈ ప్రమాదంలో మంటల కారణంగా కంటే తొక్కిసలాటలో చనిపోయిన వారే ఎక్కువ. ఎగ్జిట్ డోర్ ఒక్కసారిగా 1500 మంది తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరగగా.. చాలా మంది పిల్లలు మరణించారు.
అత్యంత ఘోరమైన ఘటన
అమెరికాలోని ట్రయాంగిల్ షర్ట్వైస్ట్ ఇండస్ట్రీ(Triangle Shirtwaist Factory) అగ్నిప్రమాదం ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అగ్ని ప్రమాదంగా చెబుతుంటారు. ఈ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. మార్చి 25, 1911లో షర్ట్వైస్ట్ ఫ్యాక్టరీలోని మూడు అంతస్తులు మంటలకు కాలి బూడిదయ్యాయి. ఫాబ్రిక్ కటింగ్లతో నిండిన స్క్రాప్ బిన్లో ఆర్పివేయని సిగరెట్ పీకను పారేయడమే అగ్నిప్రమాదానికి కారణం. చాలా మంది కార్మికులు తప్పించుకోవడానికి ఎత్తైన కిటికీల నుంచి దూకారు. అయితే కీటకిల కింద ఉన్న కాంక్రీట్ పేవ్మెంట్పై పడి మరణించారు. ఈ ప్రమాదంలో 146 మంది ప్రాణాలు కోల్పోతే అందులో 123 మంది మహిళలు, చిన్నారులే ఉండడం అత్యంత బాధకారమైన విషయం!
Also Read: ప్రకృతి ప్రకోపం..! చరిత్రలో జీవితాలను ముంచేసిన కన్నీటి వరదలు..!