Menu

America Vs Venezuela: అమెరికా నయా దందా.. డ్ర*గ్స్‌ ముసుగులో చీకటి యుద్ధం

Tri Ten B 5 months ago
america vs venzuela

మరో యుద్ధం మొదలుకానుందనే శబ్దం గాలిలో వినిపిస్తోంది. ప్రపంచం మరోసారి రక్తం చూసే రోజులు దగ్గరగా వస్తున్నాయి. ట్రంప్ తన కుర్చీలో కూర్చొని గర్జిస్తున్న ఈ సమయంలో, వెనిజులా నుంచి బయలుదేరిన ఓ పడవ కరేబియన్ సముద్రంలో పేలిపోయింది. అమెరికా బాంబులు గర్జించగా ఆ పడవలో ఉన్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు, మంటలు, సముద్రపు నీటిలో కలిసిపోయిన రక్తం.. ఇప్పుడు కొత్త తుపానుకు సంకేతాలు ఇస్తోంది. ఇది నిజంగా డ్రగ్స్ మాఫియాపై యుద్ధమా లేదా మరొక పెద్ద యుద్ధానికి పునాదా అనే అనుమానం అందరిని కలవర పెడుతోంది. అమెరికా ఇప్పటికే 4500 మంది సైనికులు, 7 యుద్ధ నౌకలను వెనిజులా తీరాలకు పంపింది. ట్రంప్ ప్రపంచ వేదికపై శక్తి ప్రదర్శన చేస్తున్నాడు.. కానీ ఈ ప్రదర్శన ఎక్కడికి దారి తీస్తుందో అన్న సందేహం ప్రపంచం అంతటా భయాన్ని నింపుతోంది.

అమెరికా ఇది మాదకద్రవ్యాల బోటు అని చెబుతున్నా, ఇప్పటివరకు ఒక్క సాక్ష్యం కూడా చూపించలేదు. ట్రంప్ విడుదల చేసిన వీడియోలో మంటలు మాత్రమే కనబడుతున్నాయి, కానీ నిజంగా ఎవరున్నారు, ఏం తీసుకెళ్తున్నారు అనే స్పష్టత లేదు. పెంటగాన్ అధికారులు కూడా ఏ చట్టం ఆధారంగా ఈ దాడి చేశామో ప్రజలకు చెప్పడానికి తడబడుతున్నారు. నిపుణులు ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని హెచ్చరిస్తున్నారు. చరిత్రలో 1898లో మైన్‌ యుద్ధానికి కారణమైనట్టే, ఇప్పుడు ఈ పేలుడు కూడా కొత్త యుద్ధానికి మంటలు రగిలిస్తుందేమో అన్న భయం పాకుతోంది. వెనిజులా అధ్యక్షుడు మడురో అమెరికాను ఓ సామ్రాజ్యవాద దేశంగా ముద్ర వేస్తూ, తమ దేశాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నామని గర్జిస్తున్నాడు.

మార్కో రుబియో ఈ ఘటనను మరింత మంటలు రగిలించేలా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా డ్రగ్స్ పట్టుకోవడం వల్ల ఎలాంటి భయం ఉండదని, కానీ పడవలను నేరుగా పేల్చివేయడం మాత్రమే మాఫియాలను ఆపగలదని గర్వంగా చెబుతున్నారు. ట్రంప్ వెనుక నిలబడి రుబియో మాట్లాడిన మాటలు, అమెరికా లోపల ఉన్న లాటినో కమ్యూనిటీలను విభజిస్తున్నాయి. కొందరు దీన్ని శక్తి ప్రదర్శనగా మద్దతు ఇస్తుంటే, మరికొందరు ఇది యుద్ధానికి తెరతీసే నిర్ణయం అని భయపడుతున్నారు. సోషల్ మీడియా అంతా మడురోను నార్కో స్టేట్ నేతగా ముద్ర వేసే పోస్టులతో నిండిపోతోంది. కానీ నిజానికి వెనిజులా పెద్దగా డ్రగ్స్ ఉత్పత్తి చేసే దేశం కాదు, అయినా అమెరికా కోపాన్ని చూపించడానికి ఈ కారణాన్ని వాడుకుంటోందని నిపుణులు అంటున్నారు. ఇలా దేశం లోపల, వెలుపల కలుగుతున్న ఈ మిశ్రమ స్వరాలు, రాబోయే రోజుల్లో యుద్ధ గర్జనలకు దారి తీస్తున్నాయనే అనుమానం మరింతగా పెంచుతున్నాయి.

అటు కరేబియన్ సముద్రంలో అమెరికా యుద్ధనౌకలు వరుసగా నిలబడి ఉన్నాయి. మిసైల్ డిస్ట్రాయర్లు, అణు జలాంతర్గాములు, ఇంటెలిజెన్స్ విమానాలు అన్నీ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇది కేవలం డ్రగ్స్ ఆపరేషన్ కాదని, కొత్త గన్‌బోట్ డిప్లమసీ ప్రారంభమైందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో వెనిజులా అధ్యక్షుడు మడురో తన దేశం 45 లక్షల మిలీషియాతో సిద్ధంగా ఉందని గర్జిస్తున్నారు. కానీ ఆ సంఖ్య వాస్తవానికి కేవలం రాజకీయ నినాదమే అని ప్రపంచం గుర్తిస్తోంది. ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో ట్రంప్ చూపిస్తున్న ప్రతి అడుగు ఒకే లక్ష్యాన్ని సూచిస్తోంది. ప్రపంచ వేదికపై శక్తిని ప్రదర్శించి, తనకో నోబెల్ బహుమతి గెలుచుకోవాలని కలగంటున్న ట్రంప.. యుద్ధంవైపు అడుగులు వెయ్యడం నిజంగా విడ్డూరమే!

ALSO READ: రాజకీయ వేదికపై విషాదాలు – జవాబుదారీతనం ఎక్కడ?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *