Menu

Tsunami: సునామీ తాకిడి.. తీరప్రాంత ప్రజల బతుకుబండి.. కళ్ళుమూసి తెరిచేలోగా…అంత శూన్యం!

Lakshmi Aruna 6 months ago
tsunami detect

మనకు సముద్రం అంటే.. కళ్ళు మూసుకోగానే ఆ అందమైన అలలు… మనసుకు హాయిగా అనిపించే శబ్దం గుర్తొస్తాయి. కానీ.. తీరప్రాంత ప్రజలకు సముద్రం అనగానే.. సునామీ గుర్తొస్తుంది… గుండెల్లో భయం పుడుతుంది. ఎందుకంటే ఆ ఒక్క అల వారి జీవితాన్ని క్షణాల్లో తలకిందులు చేసేస్తుంది. ఒక్కసారి ఊహించండి…ఒక చిన్న తీర గ్రామం. ఉదయం మత్స్యకారులు పడవలతో సముద్రంలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. పిల్లలు ఇసుకలో కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. గృహిణులు వంటలో బిజీగా ఉంటున్నారు. ఇదంతా రోజూ జరిగే సాధారణ జీవితం లాగానే ఉంటుంది. కానీ ఒక్కసారిగా సముద్రం వెనక్కి తగ్గినట్టుగా అనిపిస్తుంది… వెంటనే భీకరమైన అలలు ఊహించని వేగంతో దూసుకొస్తాయి.అదే సునామీ ..ఆ రక్కసి తీరా ప్రాంత జీవితాలలో చీకటి నింపటానికి అనుకోని అతిథిలా వస్తుంది.

బతికినా జీవించడం కష్టమే:

సునామీ అలలు వచ్చినప్పుడు వారెవరికీ సమయం దొరకదు. క్షణాల్లో ఇళ్ళు కొట్టుకుపోతాయి… పడవలు, వాహనాలు ముక్కలవుతాయి… ప్రాణాలు కూడా పోతాయి. ఎవరో బయటికి పరుగెడుతుంటారు, ఎవరో తమ పిల్లల కోసం వెతుకుతుంటారు, ఎవరో వృద్ధులను కాపాడటానికి ప్రయత్నిస్తుంటారు… కానీ ఆ సునామీ అలలు మాత్రం ఎవ్వరినీ వదిలిపెట్టవు.కళ్ళుమూసి తెరిచేలోగా…అంత శూన్యం..! ఇక చనిపోయిన వారి సంగతి అటుంచితే…జీవించి బయటపడ్డ వాళ్లకే అసలు కష్టాలు మొదలవుతాయి. ఉండడానికి ఇల్లు ఉండదు… తినడానికి ఆహారం ఉండదు… పనులు పోతాయి. మత్స్యకారులు పడవలు కోల్పోతారు, రైతులు పొలాలు కోల్పోతారు. వాళ్లకి భవిష్యత్తు చీకటిగా కనిపిస్తుంది. చిన్నశబ్దం వినిపించినా మళ్లీ అలలు వస్తాయేమోనని గుండెల్లో భయం పుడుతుంది.

మళ్లీ మనం బతికుంటామా?

ఈ సమయంలో వారు శిబిరాల్లో కూర్చొని జీవించాల్సి వస్తుంది. ఇరుకైన గుడారాల్లో పిల్లలతో, వృద్ధులతో ఉండాలి. తినడానికి ఒక గింజ కోసం ప్రభుత్వ సహాయం మీద ఆధారపడాలి. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు.మళ్ళీ మొదటి మెట్టు నుండి ప్రారంభించాల్సిందే… సునామీ.. తీరప్రాంత ప్రజలకు కేవలం ఒక ప్రకృతి వైపరీత్యం కాదు.. అది వారి జీవితాల్లో ఒక పెద్ద గాయం. ఇల్లు, ఆస్తి మాత్రమే కాదు… ప్రాణాలపై కూడా భయం. ‘మరోసారి సునామీ వస్తే? మళ్లీ మనం బతికుంటామా?’ అనే ఒకే ప్రశ్నతో వాళ్లు ప్రతీ రోజు బ్రతుకుతుంటారు. మనకు ఇది ఒక ఆరాటం కలిగించే వార్తగా అనిపించవచ్చు. కానీ తీరప్రాంతంలో జీవిస్తున్న వారి హృదయంలో ఇది ఎన్నటికీ చెరిగిపోని మచ్చ. సముద్రం అలల శబ్దం విన్న ప్రతీసారి.. వాళ్లకు అది ఒక గాయాన్ని గుర్తు చేస్తుంది.. అదే సునామీ తాకిడి!

ALSO READ: సునామీలను ముందుగానే కనిపెట్టే జంతువులు ఉన్నాయా? ఇది తెలిస్తే మీ ప్రాణాలు నిలబడతాయి!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *