డెంగీ వచ్చింది.. ప్లేట్లెట్లు పడిపోయాయి.. ఈ విషయం తెలిసిన వెంటనే చాలా మంది ఇచ్చే ఉచిత సలహా ‘పపాయా’ తినమని.. అదేనండి బొప్పాయి తినమని.. దాన్ని జ్యూస్ తాగమని.. మరికొంతమంది అయితే బొప్పాయి ఆకులను పచ్చిగా తినమని, లేదా ఆ రసాన్ని తాగమని చెబుతుంటారు. అటు మరికొంతమంది మేక పాలను తాగమని చెబుతారు. అయితే అసలు ఇవ్వని నిజాలేనా? కేవలం అపోహలేనా? మెడికల్ సైన్స్ ఏం చెబుతోంది?
దోమకాటుతో తస్మాత్ జాగ్రత్త
వర్షాకాలంలో వచ్చే వ్యాధులతో అనేక ఇబ్బందులు పడుతుంటారు ప్రజలు. ముఖ్యంగా దోమకాటు చాలా డేంజర్. దీని కారణంగా వచ్చే డెంగీ కేసులు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరుగుతున్నాయి. డెంగీ బారిన పడినప్పుడు ప్లేట్లేట్ కౌంట్ తగ్గిపోతుంది. సాధారణంగా సగటు మనషికి ప్లేట్ లేట్ కౌంట్ మైక్రోలీటర్ రక్తంలో 1,50,000 నుంచి 4,50,000 వరకు ఉంటుంది. డెంగీ ఇన్ఫెక్షన్ శరీరంలో ఉన్నంత కాలం ప్లేట్లెట్ కౌంట్ లక్షా 50 వేల కంటే తక్కువగా ఉంటుంది.
అజీర్ణానికి కారణం అవుతుందా?
ఈ ప్లేట్లేట్ కౌంట్ను పెంచడం కోసం చాలా మంది బొప్పాయిని అదేపనిగా తింటుంటారు. బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ కారణంగా ప్లేట్లేట్ కౌంట్ పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని మెడికల్ సైన్స్ చెబుతోంది. ఈ పండు పోషకమైనదే.. అయితే ప్లేట్లేట్ కౌంట్ మాత్రం పెరుగుతుందన్నది అపోహ మాత్రమే. కివి, డ్రాగన్ ఫ్రూట్ వంటివి మాత్రమే తింటే ప్లేట్లెట్స్ పెరుగుతుంది అనే దాంట్లో కూడా ఆచారం లేదు. వాస్తవానికి ఆ సమయంలో రోగికి అన్ని రకాల పండ్లు అవసరం.
డెంగీ సమయంలో మేకపాలు, బొప్పాయి ఆకులు హాని కలిగిస్తాయన్ని చాలా మంది డాక్టర్లు చెబుతున్న మాట. ఎందుకంటే డెంగీ బారిన పడినప్పుడు రోగికి బలహీనమైన జీర్ణ ప్రక్రియ ఉంటుంది. బొప్పాయి. మేకపాలు అజీర్ణానికి కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను మరింత దెబ్బతీస్తాయి.
తిప్ప తీగ కూడా అపోహే
గుడుచి.. అంటే తిప్ప తీగ.. ఇది సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో సాధారణంగా ఉపయోగించే ఒక మూలిక. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెబుతుంటారు. అయితే ఈ మూలిక ప్లేట్లేట్ కౌంట్ను పెంచుతుందని చెప్పేందుకు ఎలాంటి ఎవిడెన్స్లు లేవు.
వృద్ధులు ఎందుకు ప్రభావితం అవుతారు?
మరోవైపు డెంగీ గురించి అనేక అపోహలు ఉన్నాయి. వృద్ధులు, పిల్లలు, శరీర రంగు ముదురుగా ఉన్న వ్యక్తులు, మహిళలను మాత్రమే ఎక్కువగా ప్రభావితం చేస్తుందని నమ్ముతుంటారు. ఇది ఏ మాత్రం నిజం కాదు. వృద్ధులు, పిల్లలకు మిగిలిన వర్గాలతో పోల్చితే రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. దీని కారణంగా వాళ్లు ఎక్కువగా ప్రభావితం అవుతున్నట్టు కనిపిస్తారు. డెంగీ ఎవరికైనా సోకవచ్చు. ఇక దోమలను కొన్ని రంగులు ఆకర్షిస్తాయన్నది నిజమే. నలుపు, నారింజ లేదా ఎరుపు లాంటి ముదురు రంగు దుస్తులు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. అయితే లేత రంగు దుస్తులను ధరించడం వల్ల కాటు ప్రమాదం తగ్గుతుందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు.
Sources: Ministry of Health Affairs,Yashoda Hospitals.
Note: (This is Just a Health Advisory. For any Health Related Issues please Consult the Doctors).
Also Read: హైదరాబాద్లో విచిత్ర పరిస్థితులు.. రిపోర్టుల్లో నిల్.. జ్వరం ఫుల్!