టీమిండియాలో పెత్తనాలు చేసే వారే ఎక్కువగా ఉంటారు. నిజానికి కెప్టెన్లకు ఇది అలవాటు. వారి సెల్ఫ్ ఐడెండిటీని బిల్డ్ చేసుకోవడం కోసం అప్పటివరకు ఉన్న జట్టు కూర్పును, కీలక ఆటగాళ్లను పక్కన పెట్టడానికి ఏ మాత్రం ఆలోచించరు. గంగూలి, ధోనీ, కోహ్లీ ఇలానే చేశారు. ద్రవిడ్, కుంబ్లే, రోహిత్ లాంటి కెప్టెన్లు ఈ విషయంలో కాస్త భిన్నం. అయితే కెప్టెన్ కాకుండా ఇతరులు ఎవరైనా ఎప్పుడైనా ఈ తరహా ఐడెండిటీ కోసం పాకులాడారా అని చరిత్ర తిరగెస్తే అలాంటివారిలో చాలా కొద్దీ మందే ఉంటారు. గ్రెగ్ ఛాపెల్ ఇలానే ప్రయత్నించి తర్వాత ఆ ప్రయోగాలు వికటించి ఉన్న ఇమేజ్ను చెడగొట్టుకున్నాడు. ఇక చాలా కాలం తర్వాత టీమిండియా కోచ్ జట్టు సెలక్షన్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నాడని అర్థమవుతోంది. ఇటివలే భారత్ జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ ఆదిలోనే తప్పటి అడుగుల వేశాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గంభీరే కారణంగానే…? :
శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ల కోసం టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ రెండు ఫార్మెట్లకు వైస్ కెప్టెన్గా శుభమన్గిల్ను ఎంపిక చేయడాన్ని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా టీ20 కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎంపిక ఏ మాత్రం బాగాలేదంటున్నారు. ఎందుకంటే రోహిత్ తర్వాత టీమిండియాకు టీ20 పగ్గాలు చేపడుతాడునుకున్న హార్దిక్పాండ్యాకు కనీసం వైస్ కెప్టెన్గా ఎంపిక చేయలేదు. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను సెలక్ట్ చేశారు. ఇక వైస్కెప్టెన్గా ఎవరూ ఊహించని శుభమన్గిల్ను ఎంపిక చేశారు. ఇటివలే ముగిసిన 2024 టీ20 వరల్డ్కప్ను టీమిండియా ముద్దాడింది. ఈ వరల్డ్కప్లో భారత్ జట్టుకు రోహిత్ కెప్టెన్గా వ్యవహరిస్తే హార్దిక్పాండ్యా వైస్కెప్టెన్సీలో అదరగొట్టాడు. అటు బ్యాటింగ్, బౌలింగ్లోనూ సత్తా చాటాడు. ఇక వరల్డ్కప్ తర్వాత పొట్టి ఫార్మెట్ నుంచి రోహిత్ తప్పుకోవడంతో అంతా పాండ్యాకు కెప్టెన్గా ప్రమోషన్ వచ్చినట్టేనని భావించారు. అయితే కథ మొత్తం మారిపోయింది. పాండ్యా ఓ సాధారణ ప్లేయర్గానే శ్రీలంక సిరీస్కు ఎంపికయ్యాడు. ఈ నిర్ణయం వెనుక గంభీర్ ఉన్నాడన్నది ఫ్యాన్స్ అభిప్రాయం.
వైస్ కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించినట్టు?
నిజానికి రోహిత్ కెప్టెన్గా రెస్ట్ తీసుకున్న మ్యాచ్లకు పాండ్యానే కెప్టెన్గా వ్యవహరించాడు. ఇప్పటివరకు 16 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు పాండ్యా కెప్టెన్సీ చేశాడు. అందులో 10 మ్యాచ్ల్లో భారత్ గెలిచింది. అటు మూడు వన్డేలకూ కెప్టెన్సీ చేసిన పాండ్యా రెండు మ్యాచ్ల్లో గెలిచాడు. ఇక ఐపీఎల్లో గుజరాత్ టీమ్కు ఓ సారి టైటిల్ అందించిన పాండ్యా ఇంకోసారి రన్నరప్ స్థానంలో నిలిచేలా చేశాడు. ఇలా కెప్టెన్సీ పాండ్యా ఇప్పటికే తనకు తాను ప్రూవ్ చేసుకున్నాడు. అయినా కూడా పాండ్యాకు కెప్టెన్సీ ప్రమోషన్ రాకపోగా ఉన్న వైస్ కెప్టెన్సీ పదవీ నుంచి కూడా తప్పించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Also Read: ‘ది స్వీట్ కిస్..’ ముద్దుతో చిచ్చును ఆర్పేసిన రోహిత్!