Benjamin Netanyahu a War Criminal: గడిచిన 76 ఏళ్లలో అత్యధికంగా రక్తపాతానికి గురైన నేల పాలస్తీనా..! 1948లో ఇజ్రాయెల్ తమకు తాముగా ఓ దేశాన్ని ప్రకటించుకున్న తర్వాత పాలస్తీనాలో జరిగిన రక్తపాతం, మరణించిన చిన్నారులు, మహిళల సంఖ్య గురించి లెక్కలతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే రిపోర్టులేవీ లేవు. అమెరికా కన్నుసన్నల్లో ఇజ్రాయెల్ ఆడిందే ఆటగా సాగింది.. ఇజ్రాయెల్ ఏం చేసినా అమెరికా వెనకేసుకోస్తూనే ఉంటుంది. 2023 అక్టోబర్ 7న హమాస్తో పాటు అనేక ఇతర పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులు ఇజ్రాయిల్ పై దాడి చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 1,200 మంది మరణించారు. వీరిలో ఎక్కువమంది పౌరులే ఉన్నారు. ఈ దాడి తర్వాత ప్రతీకారం పేరుతో ఇజ్రాయెల్ పాలస్తీనాలోని పలు భూభాగాలపై విరుచుకుపడింది. హత్యకు హత్యే సమాధానమన్న రీతిలో అమాయకులను పొట్టనబెట్టుకుంది.. ఇప్పటికీ పాలస్తీనా సామాన్యులను చంపుతూనే ఉంది.
సైన్యం దారుణాలు చేస్తే ఏం అనకూడదా?
నిజానికి ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి హమాస్ ఏ విధంగానూ సరితూగదు. అయినా పాలస్తీనా కోసం పోరాడుతూనే ఉంది. పేరుకేమో హమాస్ను ఓ తీవ్రవాద సంస్థగా ప్రపంచం చెబుతుంటుంది. నిజమే కావొచ్చు.. పాలస్తీనా రక్షణ కోసం హమాస్ ఎంతో మంది ఇజ్రాయెలీ అమాయకులను బలిచ్చింది.. సొంత ప్రాంతంలోనూ ఆడవారిపై దారుణాలకు పాల్పడింది. మతం ఆధారిత వ్యవస్థ కోసం హమాస్ చేస్తున్నది ముమ్మాటికి ఉగ్రవాదమే అవుతుంది. అయితే అదే పని ఇజ్రాయెల్ సైన్యం, ప్రభుత్వం చేస్తుంటే మాత్రం అది ఉగ్రవాద సంస్థ ఎందుకు కాకుండా పోతుందన్నదే ఇప్పుడు ప్రశ్న. అంటే ఓ దేశ సైన్యం మరో దేశ అమాయకులను చంపితే చెల్లుతుందా? ఇదంతా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరీజం కాకపోతే ఇంకేంటి?
బలైపోతున్న చిన్నారులు:
2023 అక్టోబర్ 7 నుంచి మే 2024 వరకు ఇజ్రాయెల్ సైన్యం దాడులతో పాలస్తీనాలో చనిపోయిన వారి సంఖ్య 34 వేలు దాటింది. ఇందులో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారు.
ఇన్ని వేలమంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఇజ్రాయిల్ చేసేదీ మారణహోమం (Genocide ) కాదా..? దీన్ని కొన్ని దేశాలు ఎందుకు గుర్తించట్లేదు?
గాజా మొత్తాన్ని సర్వనాశనం చేసిన ఇజ్రాయెల్ తర్వాత వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలపై విరుచుకుపడుతోంది. 2024 మే 26 హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై మిస్సైళ్ల దాడి చేశారు. దీనికి ప్రతీకారంగా రఫాలో బాంబుల మోత మోగించింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో 35 మంది చనిపోయారని లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు.
అటు యూనిసేఫ్ (UNICEF) లెక్కలు మరింత ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. అక్టోబర్ 7 2023 నుంచి 2024 మార్చి వరకు ఇజ్రాయెల్ దళాల దాడుల్లో 13 వేలకు పైగా పాలస్తీనా చిన్నరులు మరిణించినట్టు యూనిసేఫ్ చెబుతోంది. పిల్లలకు తిండి, నీరు కూడా కరువైన దుస్థితి నెలకొని ఉండడం నిజంగా బాధకారం. అటు అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ విషయంలో ద్వంద్వ వైఖరి పాటిస్తున్నాయి. ఓవైపు పాలస్తీనా నెలకొన్న హృదయవిదారక పరిస్థితులపై బాధ వ్యక్తం చేస్తూనే మరోవైపు ఇజ్రాయెల్ చేస్తున్న దారుణాలపై నోరు మెదపడంలేదు.
రెండు ముఖాల దేశాలు:
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహు కరుడుకట్టిన యుద్ధోన్మాదిలా మారారు. ఆయనపై సొంత దేశంలోనే నిరసలను వ్యక్తమవుతున్నాయి. ఆయన చేస్తున్న యుద్ధాన్ని తప్పబడుతూ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ICC) నెతాన్యహూకు అరెస్ట్ వారెంట్లు జారీ చేయాలని కోరిందంటే పాలస్తీనాను ఇజ్రాయెల్ దళాలు ఎంత నాశనం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటు ఇండియాకు ఏమైందో ఏమో తెలియదు కానీ ఇజ్రాయెల్ దారుణాలపై పల్లెత్తు మాట అనడంలేదు. చరిత్రపరంగా నిజానికి ఇండియా పాలస్తీనా మద్దతుదారు.. ఇప్పటికీ యూఎన్ ఓటింగ్లో ఇదే స్టాండ్ తీసుకోని ఉన్నా పలు విషయాల్లో మాత్రం మెతక వైఖరి అవలంబిస్తోంది. ప్రధాని మోదీకి ఇజ్రాయెల్పై ప్రేమ ఉంటే అది ఆయన వ్యక్తగతంగానే ఉండాలని కానీ మొత్తం ప్రభుత్వాన్ని, దేశ ప్రజలను ప్రభావితం చేసే విధంగా ఉండకూడదు!
Also Read: అబద్ధాలు, విద్వేషాలే మోదీ పునాదులు! అసలు ఎలక్షన్ కమిషన్ నిద్ర లేచేనా?