General Elections 2024: లేనివి ఉన్నట్టు చూపించేవారిని మాయగాళ్లు అంటారు. అరచేతిలో స్వర్గాన్ని చూపించి ఇంకో చేత్తో నరకంలోకి తోసేవారిని రాజకీయ నాయకులంటారు. ప్రజలను మభ్యపెట్టి, అసలు సమస్యలను సైడ్ ట్రాక్ చేసి ఓట్లు దండుకునే వారిని బీజేపీ(BJP) నేతలంటారు. దేశంలో కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో బీజేపీ ఏం చేసింది? జీడీపీని దిగజార్చింది. పేదలను మరింత పేదరికంలోకి నెట్టింది.. కార్పొరేట్లకు కొమ్ముకాసింది. పారిశ్రామికవేత్తల చెప్పుచేతాల్లో నడిచింది. ప్రభుత్వరంగ సంస్థలను ముందుకు ఎలా తీసుకువెళ్లాలో తెలియక.. చేతకాక.. చేసేదేమీ లేక.. చేతులేత్తేసి వాటిని ప్రైవేటుకు అమ్ముకుంది. అటు నైతికంగా ప్రజలను తొక్కేందుకు అన్నీ ప్రయత్నాలు చేసింది. అందుకే దేశంలో మతోన్మాదుల సంఖ్య ఈ పదేళ్లలో పెరిగింది. అయినా మోదీనే గెలుస్తాడు.. మూడోసారి హ్యాట్రిక్ కొడతాడు. మరోసారి బీజేపీనే అధికారంలోకి వస్తుంది. ఇది సర్వేలు చెబుతున్న లెక్కలు.. ఆ లెక్కలన్ని నిజాలు కావోచ్చు.. ఎందుకంటే ఈసారి కూడా మోదీ(Narendra Modi) ఆడేది ఎమోషనల్ గేమ్ ప్లేనే కాబట్టి. ప్రజలను సెంటిమెంటల్ ఫుల్స్ చేయడం ఆయనకు బటర్తో పెట్టిన ఎడ్యూకేషన్ కదా!
మీ పీఆర్కు సలాం మోదీగారు:
2009-2014 మధ్య కాంగ్రెస్(Congress) పాలన ఘోరతి ఘోరం. ధరలు అడ్డగోలుగా పెరిగిపోయిన కాలమది. అందుకే ప్రజలకు విసిగెత్తిపోయింది.. ప్రత్యామ్నాయం కావాలనుకున్నారు. అదే సమయంలో మోదీ మోడల్ అంటూ గుజరాత్ ముసుగుతో బీజేపీ దూసుకొచ్చింది. మోదీని లీడర్గా ఎస్టాబ్లిష్ చేయడంలో ఫుల్ సక్సెస్ అయ్యింది. దేశమంతా గుజరాత్ మోడల్ చేస్తామంటూ ప్రగల్భాలు పలికింది. అటు మాటల మాయతో మోదీ ప్రజలను ఫ్లాట్ చేసేశారు. ఇంకెముంది దెబ్బకు కాంగ్రెస్ కొట్టుకుపోయింది. బీజేపీ దర్జాగా అధికారంలోకి వచ్చి కూర్చింది. ఐదేళ్లు గడిచిన తర్వాత ఆశించినంతా మార్పులేమీ జరగలేదు. కాలంతో పాటే, ప్రపంచంతో పాటే ఇండియా ముందుకు కదిలింది. అయినా మోదీ గ్రాఫ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఆయన పీఆర్ ఏ రేంజ్లో పని చేస్తుందో కానీ వారి టాలెంట్కు ఎన్ని కోట్లు జీతమిచ్చినా తక్కువే. పుల్వామా ఘటనలో 40మంది జవాన్లు అమరులైతే ఆ విషాదాన్ని కూడా ఓట్లకు వాడుకుంది బీజేపీ. నోట్ల రద్దు నిర్ణయం బెడిసికొట్టినా ఏటీఎమ్ల వద్ద భారత్ మాతాకి జై నినాదాలు వినిపించాయని ప్రచారం చేసుకుంది. ఆర్టికల్ 370 రద్దు, రామమందిరం లాంటి అంశాలను నిత్యం ప్రజల మెదళ్లలో గిర్రున తిరిగేలా చేసిన బీజేపీకి అటు అసమర్థ ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉండడం కలిసి వచ్చింది. దీంతో 2019లోనూ బీజేపీ ఈజీ విక్టరీ సాధించింది.
మళ్లీ మీదే గెలుపు మోదీదే:
కట్ చేస్తే 2024.. మరో నెల రోజుల్లో ఎన్నికలు.. దేశంలో ఏం మారింది? ఏం మారలేదు… మారినట్టు ఊహించుకోవాలి.. అంతా భ్రమపడాలి.. ఆర్థికంగా ఎన్ని గొప్ప లెక్కలు చూపించినా.. బ్రిటన్ని దాటేశామని ఊగిపోయినా ఇంకా పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు కదా. నిత్యావసర ధరలు భగ్గుమంటునే ఉన్నాయి కదా.. వైద్య ఖర్చులు తడిసిమోపెడుతున్నాయి కదా.. మరి ఎందుకీ కపట లెక్కలు.. ఎవర్ని మభ్యపెట్టడానికీ గణాంకాలు.? చెప్పుకుంటున్నట్టే అభివృద్ధి జరిగి ఉంటే ఆ లెక్కలతోనే ఎన్నికల ప్రచారంలోకి దూకచ్చు కదా.. రామమందిరం గురించి ఎందుకో.. రాముడు పేరు మీద ఇంకెన్నాళ్లు ఓట్లు దండుకుంటారు? రామమందిరం కట్టేవరకు గుడి కట్టి తీరుతామని ఓట్లు అడిగి.. కట్టిన తర్వాత హిందూవుల కల సాకరం చేశామని ఓట్లు అడుతున్నది మీరే కదా. అసలు దేవుడు, మతం, కులం, వర్గం ఊసెత్తకుండా ఓట్లు ఎందుకు అడగరు? ఎందుకంటే అవి ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన విషాయలు కాబట్టి. వాటితోనే వారిని ఫుల్స్ చేసే అలవాటు మీకుంది కాబట్టి.. అందుకే మళ్లీ అదే అజెండా..అదే ఫార్ములా.. అదే గెలుపు.. ఇది తథ్యం..!
Also Read: చరిత్ర వక్రీకరణ.. శివాజీని చూసి నేటి పాలకులు నేర్చుకోవాల్సిందిదే!