BJP Strategy In Andhra Pradesh: బీజేపీ(BJP) అతిగా ఆలోచించదు.. అనాలోచితంగా కంగారు పడదు.. ఇప్పటికీ ఇప్పుడే అనుకున్నది జరిగిపోవాలని ఆవేశ పడదు..ఆశా పడదు..! స్లో అండ్ స్టడి విన్స్ ది రేస్ ఫార్ములాను ఫాలో అవుతుంది. అందుకే ఒకట్రేండు రాష్ట్రాల్లో గెలుపుతో మొదలైన బీజేపీ ప్రస్థానం దాదాపు ఇండియా మొత్తం వ్యాపించిందంటే వారికున్న సహనమే కారణం. మందిర్-మండల్ రాజకీయాల సమయంలో హిందు మెజార్టీ ఓటు బ్యాంక్ను నమ్ముకోని ఉత్తరాదిన క్రమక్రమంగా విస్తరించిన కాషాయ పార్టీ దక్షిణాదిన ఇప్పటికే వెనుకంజలోనే ఉంది. కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీకి అంతగా ఆదరణ లేదు. కర్ణాటక తర్వాత ఎక్కువగా తెలంగాణపై కమలనాథుల దృష్టి ఉంటుంది. ఇటు ఏపీపైనా ఇటీవలి కాలంలో బీజేపీ ఫోకస్ పెంచింది. ముఖ్యంగా 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. దాని కోసం బీజేపీ ఎంచుకున్న గేమ్ ప్లాన్ కాపుల చుట్టూ తిరుగుతోంది.
ఏపీలో కులాలే ప్రధాన ఎజెండా:
కుల రాజకీయాలు దేశమంతటా ఉన్నా ఏపీకి ఇందులో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏపీలో కులాలను, రాజకీయాలను వేరు చేసి చూడలేం. ఓట్ల పరంగా ఏపీలో కాపుల జనాభా ఎక్కువ. వీరిని విస్మరించి ఏ పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. గత 2019 ఎన్నికల్లో కాపు ఓట్లు అధికంగా వైసీపీకి పడ్డాయి. 32మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 30 మంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. మంత్రివర్గాంలోనూ జగన్ కాపు(Kapu)లకు ప్రయారిటీ ఇచ్చారు. రానున్న(2024) ఎన్నికల్లో కాపుల ఓట్లు ఎటు పడతాయన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా కాపు నేతలు ఈసారి ఐక్యంగా పవన్కు జై కొడుతున్నారు. అటు ఏపీ రాజకీయాలను నిశితంగా గమనిస్తోన్న బీజేపీ జనసేన(Janasena)తో ఇప్పటికే పొత్తులోనే కొనసాగుతుండగా.. ఇటివలీ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి పద్మవిభూషన్ను ప్రకటించింది.
హిందూత్వా.. కులత్వా:
నాలుగున్నరేళ్లుగా బీజేపీతో పొత్తులోనే ఉన్నా మునుపెన్నడూ లేని విధంగా పవన్కు బీజేపీ హైకమాండ్ అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇటు పవన్ సైతం గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి కుల రాజకీయాలకు తెరలేపారు. కుల, మత ప్రస్థావన లేని రాజకీయాలంటూ జనసేనతో ముందుకొచ్చిన పవన్ ఇప్పుడు బహిరంగంగానే కులరాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ హిందూత్వ ఎజెండాను భుజానవేసుకోని ఊరురా తిరుగుతున్నారు. ఓ రకంగా బీజేపీ-జనసేనకు ఫెవికల్ బాండ్ ఏర్పడింది. ఇలా కాపుల ఓట్లను బీజేపీ తన ఓట్ బ్యాంక్గా మార్చుకోవాలని ప్రయత్నిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తుండగా.. ఇంతలోనే చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తారన్న ప్రచారం జోరందుకుంది.
నామినేటెడ్ ఎంపీగా చిరంజీవి?:
మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభలో అడుగు పెట్టనున్నట్లు సమాచారం. కళ రంగంలో చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లోక్సభ ఎన్నికల ముందు మెగాస్టార్ను నామినేట్ చేస్తే ఏపీలో కాపు ఓట్లతో పాటు ఫ్యాన్స్ ఓట్లు కొల్లగొట్టవచ్చన్నది కమలనాథుల ఆలోచన. రాజ్యసభ నామినేట్ పోస్టుల్లో మొత్తం 12 స్థానాలు ఉండగా ప్రస్తుతం అందులో మూడు ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఒక్క స్థానానికి మెగాస్టార్ను నామినేట్ చేస్తారని వార్తలు వైరల్గా మారాయి. ఈ మధ్య తరచూ బీజేపీ కార్యక్రమాలకు చిరంజీవి హాజరు అవుతుండటంతో మెగాస్టార్ రాజ్యసభ ప్రచారానికి మరింత బలం చేకూరినట్టుయ్యింది.
Also Read: రాజ్యసభ ఎన్నికలు.. తెలంగాణలో మూడో స్థానంపై ప్రతిష్టంభన!
1 Comment